అప్పుడు సిట్‌తోనే అన్నీ… ఇప్పుడు వద్దట!

supreme-court-jagan

జగన్‌ ప్రభుత్వం చంద్రబాబు నాయుడుతో టిడిపి ముఖ్య నేతలందరినీ ఏదో ఓ కేసులో ఇరికించి లోపలేసేస్తే ఎన్నికలలో పోటీ లేకుండా గెలిచేయొచ్చని భావించింది. అందుకే జగన్మోహన్‌ రెడ్డి 175కి 175 సీట్లు మనకే అని చెపుతుండేవారేమో?

అప్పుడు ప్రతీ కేసుని సీఐడీ, ఏసీబీ పోలీసులే దర్యాప్తు జరిపేవారు. అది సహజం కూడా. జగన్‌, వైసీపి నేతలు కోరుకున్నట్లుగానే ఆ కేసుల విచారణ, కేసులు నమోదు వగైరా జరుగుతుండేవి. కానీ ఇప్పుడు తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై టిడిపి కూటమి ప్రభుత్వం ఐజీ స్థాయి అధికారితో సిట్‌ విచారణ జరిపిస్తే దానిపై తమకు నమ్మకం లేదని, ప్రభుత్వం చేతిలో ఉండే సిట్ విచారణ నిష్పక్షపాతంగా జరగదంటూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్‌ వేసింది. సుప్రీంకోర్టు స్వయంగా ఈ వ్యవహారంపై విచారణ జరపాలని వైసీపి కోరుతోంది.

ADVERTISEMENT

అంటే జగన్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సిట్ విచారణ నిష్పక్షపాతంగా జరగలేదని, జరిగే అవకాశం కూడా లేదని ఇప్పుడు వైసీపి స్వయంగా ధృవీకరించిన్నట్లే కదా?

అలాగే రాష్ట్ర స్థాయిలో పోలీస్ యంత్రాంగం, జిల్లా కోర్టులు, హైకోర్టుపై కూడా వైసీపికి నమ్మకం లేకనే సుప్రీంకోర్టుకి వెళ్ళిందని అనుకోవలసి ఉంటుంది.

శాసనసభ ఎన్నికలలో టిడిపి, జనసేన పార్టీలు దమ్ముంటే విడివిడిగా పోటీ చేయాలని అలా చేయకుంటే వారిది రాజకీయ వ్యభిచారమే అని జగన్‌ ఓ సిద్దాంతం తయారుచేసుకొని వాదిస్తుండేవారు. అంటే రాష్ట్రంలో ప్రతిపక్షాలు తాను కోరుకున్నవిదంగా రాజకీయాలు చేస్తూ, వచ్చి తన చేతిలో బలైపోవాలని కోరుకునేవారన్న మాట!

ఇప్పుడు ఈ వ్యవహారంలో కూడా వైసీపి అచ్చం అలాగే ప్రవర్తిస్తోంది. ఈ వ్యవహారంలో చంద్రబాబు నాయుడే తప్పు చేశారన్నట్లు వితండవాదం చేస్తున్న వైసీపి, తాము కోరుకున్నవిదంగానే దీనిపై విచారణ జరగాలని, తమని ఈ కేసులో నుంచి బయటపడేసి వీలైతే చంద్రబాబు నాయుడుని ఇరికించేయాలని కోరుకుంటున్నట్లు అర్దమవుతోంది. ఆశ మంచిదే కానీ ఇంత అత్యాశ పనికిరాదు.

ADVERTISEMENT
Latest Stories