రాజకీయాలలో ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తులుగా ‘జేసీ బ్రదర్స్’కున్న పేరు రాజకీయ విజ్ఞులకు తెలియనిది కాదు. ఒక్కోసారి ఈ వ్యాఖ్యలు స్వపక్ష నేతలను కూడా ఇబ్బంది పెడుతున్న వైనం తెలిసిందే. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యక్తిగత, రాజకీయ పరిణామాలపై స్పందిస్తూ తనదైన శైలిలో జవాబిచ్చారు. రామలక్ష్మణుల్లా ఉండే మా ఇద్దరి మధ్య విభేదాలంటే… మా ఇంట్లో ఆడవాళ్లు చేయాల్సిందే. నా భార్య కానీ, మా వదిన కానీ… వాళ్లిద్దరూ మా కంటే బాగా కలిసి ఉంటారు, ఇంకా అవకాశం ఎక్కడుంది అని చెప్పిన ప్రభాకర్ రెడ్డి, వైఎస్సార్ తో ఉన్న అనుబంధం గురించి తెలిపారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయినప్పుడు బోరున ఏడ్చిన మాట నిజమేనని, దానికి కారణం లేకపోలేదని, వైఎస్ అంటే తనకు చాలా ఇష్టమని, తానంటే కూడా ఆయన బాగా ఇష్టపడేవారని, దీంతో ఆ బాధను తట్టుకోలేక పోయానని, ఒక మంచి స్నేహితుడిని, ఒక వ్యక్తిని పోగొట్టుకున్నాననే బాధను భరించలేకపోయానని అన్నారు. కర్కశంగా కనిపించే తానూ చాలా ఏమోషనల్ పర్సన్ అని, అందరూ, అనుకున్నట్లు తానేమీ రూడ్ గా ఉండనని తన వ్యక్తిత్వం గురించి తెలిపారు.
ఇక, ప్రస్తుతం రాజకీయాలలో కీలక వ్యక్తులుగా ఉన్న నేతలపై ఒక్క మాటలో తన భావాలను వ్యక్తపరిచిన ప్రభాకర్ రెడ్డి… నారా లోకేశ్ గురించి ఇప్పుడే తెలపడానికి ఏమీ లేదని, ‘హి ఈజ్ వెరీ యంగ్ మ్యాన్’ అంటూ అభివర్నిన్చూర్. ఇదే సమయంలో ప్రతిపక్ష నేత జగన్ గురించి ‘హి ఈజ్ అన్ ఫిట్ ఫర్ పాలిటిక్స్’ అని తేల్చిచెప్పారు. సీఎం చంద్రబాబు విజన్ ఉన్న వ్యక్తి అని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆప్యాయత గల మనిషి అని, చిరంజీవి సినిమా యాక్టర్ మాత్రమేనని, పవన్ కళ్యాణ్, పరిటాల రవి, వైఎస్ రాజారెడ్డిలపై ‘అబ్బే..అబ్బే’ అంటూ సమాధానం దాటవేశారు.



