తాజాగా వెలువడిన పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఫలితాలు… వాటి పర్యవసానాల నుంచి దేశంలో అన్ని పార్టీలు కొత్త పాఠాలు నేర్చుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి.
ముందుగా ‘సర్’ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) పేరుతో ఓటర్ల తొలగింపుతో పార్టీల బలాబలాలు, వాటితో పాటే ప్రభుత్వాలు మారుతాయని పశ్చిమ బెంగాల్ నిరూపితమైంది.
‘సర్’ పేరుతో సుమారు 93 లక్షల ఓటర్లను జాబితాలో నుంచి తొలగించడం వలన సుమారు 100 స్థానాలలో తాము ఓడిపోయామని సిఎం మమతా బెనర్జీ ఆరోపించారు. అంటే ‘సర్’తో ప్రాంతీయ పార్టీల పరిస్థితి తారుమారు అవుతుందన్న మాట! అందుకే ఏపీలో వైసీపీ, తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలలో అప్పుడే ఆందోళన మొదలైందని భావించవచ్చు.
కానీ తమిళనాడులో సిఎం స్టాలిన్తో సహా అధికార డీఎంకే ఓడిపోయినా బిజేపితో పొత్తులో ఉన్న అన్నాడీఎంకే కూడా గెలవలేకపోయింది. అదీ ఓడిపోగా విజయ్ దళపతి తొలి ప్రయత్నంలోనే టీవీకే పార్టీ ఏకంగా 108 సీట్లు గెలుచకున్నారు. అంటే తమిళనాడులో ‘సర్’ ఎఫెక్ట్ లేదా?
ఒకవేళ ఉన్నా ప్రాంతీయ, భాషాభిమానం, సినీ, రాజకీయ అభిమానం ఎక్కువగా ఉన్నందున ‘సర్ ఎఫెక్ట్’ని అధిగమించాయా? తమిళనాడులో అధిగమించగలిగితే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో వైసీపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కూడా ఈవిధంగా అధిగమించి ఎన్నికలలో గెలవగలవా? లేదా బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలా తుడిచి పెట్టుకుపోక తప్పదా? అనే ప్రశ్నకు కాలమే సమాధానం చెపుతుంది.




