డిజిటల్ లావాదేవీలపై తల బద్దలు కొట్టుకుంటున్న వేళ ఆధార్ ఆధారిత చెల్లింపుల విధానాన్ని చూసి షాకయ్యానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆధార్ తో చెల్లింపులు ఇంత సులభమని తెలిసి ఆశ్చర్యపోయానని, ఈ విధానం ఇప్పుడు దేశగతినే మార్చివేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విజయవాడలో జరుగుతున్న మంత్రులు, కలెక్టర్లు, వివిధ శాఖల అధిపతులతో జరుగుతున్న సమావేశంలో చంద్రబాబు ఈ ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు.
ఇదే సమావేశంలో ఇక్కడున్న వారిలో ఎంత మంది మొబైల్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారో చేతులు ఎత్తాలని సీఎం కోరగా, అక్కడున్న వారిలో 20 శాతం మంది కూడా స్పందించలేదు. దీంతో మీరే ఇలా ఉంటే, ప్రజలకిక నగదు రహిత ట్రాన్సాక్షన్స్ గురించి ఎలా చెబుతామని బాబు ప్రశ్నించారు. సాయంత్రానికి మందు లేకుంటే మైండ్ పనిచేయదన్న ఉద్దేశంతో మందుబాబులు మెదడుకు మేత పెట్టి, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎలా చేయాలో నేర్చేసుకున్నారని, “మీ కంటే మందుబాబులే నయం” అంటూ జోకేసి అందరినీ నవ్వించారు.
స్వైపింగ్, మొబైల్ మాధ్యమంగా లావాదేవీలు జరిగేలా మైండ్ సెట్ మార్చుకోవాలని చురకలేశారు. ఇదంతా విన్న తరువాత “అసలు మన బాస్ నగదు రహిత లావాదేవీలు చేస్తున్నారో లేదో కనుక్కుంటే బాగుంటుంది” అని కొందరు అమాత్యులు గుసగుసలాడుకోవడం విశేషం. అయితే ఆధార్ అనుసంధంతో కూడిన పేమెంట్స్ విధానం చాలా తేలికగా ఉందని చాలామంది చెప్పడంతో, ఇదే విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.



