టిడిపిలో సీనియర్ నేతలలో దేవినేని ఉమ ఒకరు. ఇదివరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా చేశారు. కానీ ఈసారి అనివార్య కారణాల వలన ఆయనకి ఎమ్మెల్యేగా టికెట్ కూడా లభించలేదు. కనుక కనీసం ఎమ్మెల్యే పదవి కూడా లేదిప్పుడు.
అయితే దేవినేని ఉమ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని, ప్రభుత్వం ఏర్పాడ్డాక ఏదో పదవి ఇవ్వలేదని అలిగి ఇంట్లో కూర్చోలేదు. పార్టీ అధిష్టానాన్ని విమర్శించలేదు. విజయవాడ వరదలు రాగానే ఆయన ముంపు ప్రాంతాలలో పర్యటించి, అక్కడ ప్రజలకు అవసరమైన ఏర్పాట్లు చేశారు.
బుడమేరు గండ్లని పూడ్చుతున్న మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి ఆ పనులను పర్యవేక్షించారు. గండ్లు పూడ్చడానికి అవసరమైన సామాగ్రిని ఏర్పాటు చేయిస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ గేట్లని మూడు పడవలు ఢీ కొన్నట్లు తెలియగానే అక్కడకు చేరుకొని వాటి మరమత్తుల గురించి కన్నయ్య నాయుడుతో చర్చించి అవసరమైన ఏర్పాట్లు చేయించారు. ఇలా నాలుగైదు రోజులుగా దేవినేని ఉమ నగరం నలువైపులా తిరుగుతూ పనిచేస్తూనే ఉన్నారు.
వైసీపి ఎమ్మెల్యేలు, మంత్రులు ఇదివరకు ప్రజలకు కనబడేవారు కానీ ఇప్పుడు పదవి అధికారం లేకపోవడంతో ఎవరూ ఇళ్ళలో నుంచి బయటకు రావడం లేదు. ఇంట్లో కూర్చోనే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఫోన్లో ట్వీట్స్ వేస్తూ కాలక్షేపం చేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.
కానీ దేవినేని ఉమ కనీసం ఎమ్మెల్యే పదవి కూడా లేకపోయినా మంత్రులతో సమానంగా కష్టపడి పనిచేస్తున్నారు. తద్వారా ఎవరినో మెప్పించాలని కాదు. తన జిల్లాకి, ప్రజలకి కష్టం వచ్చింది కనుక తన అనుభవాన్ని వారి కోసం వినియోగించాలనే ఉద్దేశ్యంతోనే దేవినేని ఉమ పనిచేస్తున్నారు. ఇటువంటి నిబద్దత గల నాయకులు ఉన్నందునే టిడిపి ఎన్ని ఆటుపోట్లు వచ్చినా చెక్కు చెదరకుండా ధృడంగా నిలిచి ఉందని చెప్పొచ్చు. వైసీపి అధినేత జగన్ విజయవాడలో పర్యటిస్తే ఆయన వెంట ఒక్క సీనియర్ నాయకుడు లేదు. టిడిపి, వైసీపిల మద్య ఉన్న తేడా ఇదే!




