నారా లోకేష్‌ పాదయాత్ర ముహూర్తం ఖరారు

TDP-Nara-Lokesh-Padayatra-Dateటిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రకు ముహూర్తం ఖరారైంది. 2023, జనవరి 27వ తేదీ నుంచి సుమారు ఏడాదిపాటు అంటే ఏపీ శాసనసభ ఎన్నికల గంట కొట్టేవరకు పాదయాత్ర చేయనున్నారు. జనవరి 27న చిత్తూరు జిల్లాలో కుప్పంలో నుంచి పాదయాత్ర మొదలుపెట్టి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగిస్తారు. త్వరలోనే నారా లోకేష్‌ పాదయాత్రకి రూట్ మ్యాప్‌ని టిడిపి ఖరారు చేసి ప్రకటిస్తుంది. ఈ పాదయాత్రలో నారా లోకేష్‌ ఎక్కడికక్కడ సభలు, పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తారు. పాదయాత్రలో ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకొంటారు.

ADVERTISEMENT

జగన్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్ళబోతోందనే సమాచారం రావడంతో నారా లోకేష్‌ రెండు నెలల క్రితమే పాదయాత్రకు బయలుదేరాలనుకొన్నారు. కానీ జగన్ ప్రభుత్వం వెనక్కు తగ్గినట్లు తలుసుకొని నారా లోకేష్‌ తన పాదయాత్రను వాయిదా వేసుకొన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ కూడా అదే కారణంతో తన బస్సుయాత్రని వాయిదా వేసుకొన్న సంగతి తెలిసిందే. కనుక పవన్‌ కళ్యాణ్‌ కూడా ఇంచుమించు జనవరిలోనే యాత్రకి బయలుదేరే అవకాశం ఉంది. పవన్‌ కళ్యాణ్‌ బహుశః ఇచ్చాపురం నుంచి బస్సుయాత్ర చేసే అవకాశం ఉంది.

నారా లోకేష్‌, పవన్‌ కళ్యాణ్‌ ఇద్దరూ రాష్ట్రానికి చెరో వైపు నుంచి యాత్రలు ప్రారంభిస్తే సహజంగానే వారు స్థానిక వైసీపీ నేతలను, జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ముందుకు సాగుతారు. అప్పుడు వైసీపీ నేతలు కూడా వారిని అంతే ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రయత్నించడం ఖాయం. కనుక రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిపోవచ్చు. ఈలోగా రాష్ట్రంలో మారేవైనా రాజకీయ పరిణామాలు జరిగితే అంటే నేతలు పార్టీలు మారడం లేదా ఎన్నికల పొత్తులు వంటివి జరిగితే రాజకీయ వాతావరణం ఇంకా వేడెక్కే అవకాశం ఉంటుంది.

ADVERTISEMENT
Latest Stories