గత తెలంగాణ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ, సీపీఐ, టిడిపిలతో పొత్తులు పెట్టుకొని పోటీ చేసింది. కేసీఆర్ దానినే అస్త్రంగా మార్చుకొని తెలంగాణలో కాంగ్రెస్ని అడ్డంపెట్టుకొని పాలన చేసేందుకు చంద్రబాబు నాయుడు మళ్ళీ వచ్చారంటూ తెలంగాణ సెంటిమెంట్ రగిలించి ఎన్నికలలో గెలిచారు. కనుక తెలంగాణలో బిజెపిలో కొందరు నేతలు టిడిపి సహాయసహకారాలు తీసుకోవద్దని వాదించి ఒంటరిగా పోటీ చేస్తూ మిశ్రమ ఫలితాలు సాధిస్తున్నారు. ఇటీవల జరిగిన మునుగోడు ఉపఎన్నికలలో టిడిపి కూడా పోటీ చేయాలనుకొంది కానీ బిజెపి అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభ్యర్ధన మేరకు వెనక్కు తగ్గి సహకరించిందని బిఆర్ఎస్ నేతలు ఆరోపించారు. వారికి టిడిపి పోటీ చేస్తే అభ్యంతరం చేయకపోయినా అభ్యంతరం అన్నట్లుంది!
వచ్చే ఎన్నికలలో ఎట్టి పరిస్థితులలో గెలిచి తెలంగాణలో అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉన్న బిజెపి నేతలలో కొందరు టిడిపితో పొత్తులు పెట్టుకొంటే మేలని వాదిస్తుంటే, కొందరు టిడిపితో పొత్తులు పెట్టుకొంటే కేసీఆర్కి మళ్ళీ అస్త్రం అందించిన్నట్లవుతుందని వాదిస్తున్నారు. అయితే తెలంగాణలో టిడిపికి ఎంత బలం ఉందో నిరూపించి చూపితే తప్ప బిజెపి నేతలకి నమ్మకం కలగదని చంద్రబాబు నాయుడు భావించారో ఏమో మొన్న ఖమ్మంలో బహిరంగసభ నిర్వహించగా దానికి వేలాదిగా ప్రజలు, కార్యకర్తలు తరలివచ్చారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం చేరేవరకు ఆయనకి దారి పొడవునా మంచి స్పందనే వచ్చింది.
అది చూసి కేసీఆర్ ఉలిక్కి పడ్డారు. వెంటనే నలుగురు మంత్రులు హడావుడిగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అంటే టిడిపి బలాన్ని కేసీఆర్, బిఆర్ఎస్ నేతలు బాగానే గుర్తించారన్నా మాట! ఇక గుర్తించాల్సింది తెలంగాణ బిజెపి నేతలే!
నిజానికి తెలంగాణలో ఏదో సాధించాలనే ఉద్దేశ్యంతో చంద్రబాబు నాయుడు బిజెపితో పొత్తులు పెట్టుకోవాలనుకోవడం లేదు. వచ్చే ఎన్నికలలో ఏపీలో కేంద్రం తోడ్పాటు కావాలని ఆశిస్తున్నారు. కనుక తెలంగాణలో బిజెపికి తోడ్పాటు అందించేందుకు సిద్దపడుతున్నారని చెప్పవచ్చు. చంద్రబాబు నాయుడుని విమర్శించిన తెలంగాణ మంత్రులు కూడా అదే చెప్పారు.
ఒకవేళ ఇప్పటికీ ఏపీ, తెలంగాణలో టిడిపితో పొత్తులు వద్దని బిజెపి భావిస్తే దాని వలన ఏపీలో టిడిపి మరికాస్త గట్టిగా కృషి చేయాల్సి వస్తుంది తప్ప నష్టపోదు. ఇక తెలంగాణలో బిజెపి కలిసి కలవకపోయినా టిడిపి సొంతంగానే కొన్ని సీట్లు గెలుచుకోగలదు. అప్పుడు బిజెపియే టిడిపి మద్దతుకోరే పరిస్థితి ఏర్పడవచ్చు. త్వరలో నిజామాబాద్లో మరో బహిరంగసభ ఏర్పాటు చేస్తామని తెలంగాణ టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ మొన్నే ప్రకటించారు. బహుశః అదీ నిర్వహించిన తర్వాత బిజెపికి తత్వం బోధపడుతుందేమో?



