తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు బయలుదేరే ముందు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “అనగనగా తెలంగాణలో ఓ ట్రంప్ ఉండేవారు. అయన తన ఇష్టారాజ్యం చెసేవారు. అది నచ్చక ప్రజలు గద్దె దించేశారు. కనుక అహంకారంతో విర్రవీగితే అది
తెలంగాణ ట్రంప్ అయినా అమెరికా ట్రంప్ అయినా ప్రజలే బుద్ధి చెపుతారు,” అని అన్నారు. ట్రంప్ సుంకాలు, ద్వంద వైఖరిని కూడా సిఎం రేవంత్ రెడ్డి తప్పు పట్టారు. కానీ ట్రంప్ వైఖరి వలన భారత్కు జరిగే నష్టం కంటే అమెరికాకు జరిగే నష్టమే ఎక్కువ ఉంటుందని అభిప్రాయపడ్డారు.
సుంకాలు పెంచేసి భారత్ని దెబ్బ కొట్టాలని ట్రంప్ అనుకుంటున్నారు కానీ ఈ కారణంగా ఆయా ఉత్పత్తుల సరఫరా తగ్గితే ధరలు పెరిగి అమెరికన్లపైనే ఆర్ధికభారం పడుతుందన్నారు. ట్రంప్ తీరుతో విదేశీ విద్యార్ధులు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నప్పటికీ దీర్గాకాలంలో అమెరికన్ యూనివర్సిటీలే ఎక్కువ నష్టపోతాయన్నారు.
భారతీయ విద్యార్ధులు ఉన్నత విద్యల కోసం అమెరికాకు రావడం కాదు… అమెరికన్ యూనివర్సిటీలనే భారత్కు రప్పించుకుంటామని అన్నారు. ఈసారి పర్యటనలో తాను కొన్ని అమెరికన్ యూనివర్సిటీలతో భేటీ అయ్యి తెలంగాణకు ఆహ్వానిస్తానని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ట్రంప్ సుంకాల ఒత్తిడి తగ్గించడం కోసం
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే భారీగా జీఎస్టీ తగ్గించడం ద్వారా అటు వ్యాపారులకు, ఇటు సామాన్య ప్రజలకు కూడా చాలా ఉపశమనం కలిగిస్తోంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ కామర్స్ సంస్థలు, ద్విచక్ర వాహనాలు, కార్ల కంపెనీలు ఇప్పటికీ జీఎస్టీ తగ్గింపు లాభాన్ని అందుకోమని ఊరిస్తున్నాయి.
కనుక గత ఏడాది కంటే ఈసారి ప్రజలు పెద్ద ఎత్తున దసరా, దీపావళి, క్రిస్మస్ షాపింగ్ చేసినట్లయితే ట్రంప్ సుంకాల ఒత్తిడిని భారత్ అధిగమించినట్లే!
తెలంగాణకి ఓ ట్రంప్ ఉన్నట్లే ఆంద్రాకు కూడా అనగనగా ఓ ట్రంప్ ఉండేవారు. తెలంగాణ ట్రంప్ పూర్తిగా చల్లబడినప్పటికీ జూనియర్ ట్రంప్, ఏపీ ట్రంప్ ఇద్దరూ చాలా చాలా జోరుగానే ఉన్నారు.
తెలంగాణ ట్రంప్కు రేవంత్ రెడ్డి ట్రీట్మెంట్ పూర్తయింది. కానీ అవసరమైతే సీబీఐ సర్జరీ చేయవచ్చు. అమెరికా ట్రంప్కి ప్రధాని మోడీ ఇంకా ట్రీట్మెంట్ చేస్తున్నారు. అలాగే ఏపీ ట్రంప్కి చంద్రబాబు నాయుడు ట్రీట్మెంట్ ఇంకా కొనసాగుతోంది. ఈ ఇద్దరి ట్రంప్లకు పూర్తిగా నయమవడానికి మరికొంత కాలం పట్టేలా ఉంది.





