రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడవడమే విశేషం అనుకుంటే కేసీఆర్ని ఓడించి ముఖ్యమంత్రి కూడా అయ్యారు. కనుక రాజకీయంగా అత్యున్నత స్థానానికి చేరుకున్నట్లే భావించవచ్చు.
కానీ రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయాణంలో ఇంకా అనేక మజిలీలు, పెద్ద లక్ష్యాలు ఉన్నాయా? అంటే అవుననే అనిపిస్తోంది.
సిఎం రేవంత్ రెడ్డి ముందు రాష్ట్రానికి సంబందించి అనేక సమస్యలు పోగుపడి ఉన్నాయి. వాటన్నిటినీ పరిష్కరించడానికి 5 ఏళ్ళ సమయం చాలా తక్కువే. కనుక ముఖ్యమంత్రి కాగానే వాటిపై దృష్టి పెడతారనుకుంటే, 10 నెలలు గడిచేసరికి మూసీ ప్రక్షాళన అంటూ కొత్త కార్యక్రమంపై ఎక్కువ దృష్టి పెడుతుండటం ఆలోచింపజేస్తుంది.
కేవలం దక్షిణ కొరియా స్పూర్తితో కేవలం మూసీ ప్రక్షాళనకే పరిమితం అవుతారా లేక ఆయన మనసులో ఇంకేమైనా పెద్ద ఆలోచనలు ఉన్నాయా? అంటే ఉన్నాయని స్వయంగా చెప్పారు.
గుజరాత్లో నర్మదానది మద్యన ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ పేరుతో 192 మీటర్ల ఎత్తైన సర్దార్ పటేల్ విగ్రహం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
తమ ప్రభుత్వం మూసీని ప్రక్షాళన చేసి ఆ ఒడ్డున అంతకంటే పెద్ద మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలనుకొంటున్నట్లు సిఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఓ టీవీ కార్యక్రమంలో చెప్పారు.
“కేంద్ర ప్రభుత్వం నర్మదా నదిని ప్రక్షాళనం చేసి సర్దార్ పటేల్ విగ్రహం పెట్టుకున్నప్పుడు, మేము మూసీ నదిని ప్రక్షాళన చేసుకొని జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం పెట్టుకోకూడదా?” అనే రేవంత్ రెడ్డి ప్రశ్న ఆలోచింపజేస్తుంది.
మహాత్ముడి చితాభస్మాన్ని 11 నదులలో కలిపారు. వాటిలో మూసీనది కూడా ఒకటి. అందుకు నిదర్శనంగా లంగర్ హౌస్ వద్ద బాపూ ఘాట్ కూడా ఉంది. కనుక సిఎం రేవంత్ రెడ్డి మూసీని శుభ్రం చేయించి ఒడ్డున గాంధీ విగ్రహం పెడతామంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు.
కానీ మద్యలో బీజేపీ, కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోడీ, పటేల్ విగ్రహం ప్రస్తావన చేయడమే ఆలోచింపజేస్తుంది.
అంటే భవిష్యత్లో రేవంత్ రెడ్డి జాతీయ రాజకీయాలలో ప్రవేశించి కాంగ్రెస్ తరపున బీజేపీతో పోరాడబోతున్నారా? అంటే అవుననే అనిపిస్తోంది. టిడిపి నుంచి కాంగ్రెస్లో చేరి పిసిసి అధ్యక్ష పదవి, ముఖ్యమంత్రి పదవి చేపట్టిన రేవంత్ రెడ్డి జాతీయ రాజకీయాలలో ప్రవేశించలేరా?




