ఓ చిన్న మున్సిపాలిటీ లేదా దానిలో ఓ వార్డు మెంబర్ పదవి గెలుచుకుంటే ఏమైనా లాభం ఉంటుందా? అంటే ‘మార్కెట్ రేట్’ లేదా ‘డిమాండ్ సప్లై’లను గెలిచిన అభ్యర్ధులకు ఎంతో కొంత లబ్ది కలుగుతుంది తప్ప ఆయా పార్టీలకు ఏమాత్రం లాభం ఉండదనే చెప్పాలి.
ఉదాహరణకు మధిరలో టీడీపి అభ్యర్ధి బోడేపూడి రేవతి, నల్గొండలో నేరేడుచర్ల 14వ వార్డు నుంచి పోటీ చేసిన జనసేన అరూరి విజయలక్ష్మి విజయం సాధించారు.
అయితే బలమైన ప్రతిపక్షపార్టీ గెలుచుకున్న మున్సిపాలిటీలకు లేదా శాసనసభ నియోజకవర్గాలకే అధికార పార్టీలు నిధులు మంజూరు చేయవు. పైగా రాజకీయంగా ఇబ్బంది పెడుతుంటాయి కూడా. కనుక వీరిద్దరే కాదు… గెలిచిన స్వతంత్ర అభ్యర్ధులు కూడా ఒంటరిగా చేయగలిగిందేమీ ఉండదు. ‘మంచి ధర వస్తే’ ఏదో పార్టీలో చేరిపోవడం ఖాయం.
అయితే వారి గెలుపు ఆ ప్రాంతాలలో ఆయా పార్టీలకు ఇంకా బలం ఉందనే విషయం నిరూపిస్తోంది. అయితే అది వాపూని చూసి బలుపనుకొని గోదాలో దిగితే కల్వకుంట్ల కవితలా చేతులు కాల్చుకోవాల్సి వస్తుంది.
తెలంగాణలో రాజకీయ శూన్యత ఏం లేదు. కాంగ్రెస్, బిజేపి, బీఆర్ఎస్, మజ్లీస్ నాలుగు బలమైన పార్టీలున్నాయి. కొత్తగా కవిత కూడా బరిలో దిగుతున్నారు. కనుక టీడీపి, జనసేనలు తెలంగాణలో దిగి చేతులు కాల్చుకోవడం కంటే, అక్కడున్న బలంతో ‘కింగ్ మేకర్’గా ఉండటమే చాలా మంచిది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే జనసేన ఇలా ప్రతీ ఎన్నికలలో తన అదృష్టం పరీక్షించుకోవాలని ప్రయత్నిస్తుండటం వల్లనే. అదేదో ఏపీలో పార్టీని బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెడితే చాలా మంచిది. టీడీపికి కూడా ఇదే వర్తిస్తుంది. తెలంగాణ ‘బంగారి పుట్ట’లో వేలు పెట్టడం మంచిది కాదు.




