ఈ పంచాయితీ పాఠం ఎవరికి… కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌?

Telangana Panchayat Election Results

తెలంగాణ పంచాయితీ ఎన్నికలు పూర్తయ్యాయి. కాంగ్రెస్‌ పార్టీ సుమారు 50 శాతం, బీఆర్ఎస్‌ పార్టీ సుమారు 25 శాతం పంచాయితీలు దక్కించుకున్నాయి. మిగిలిన 25 శాతం బీజేపీ, ఇతరులు దక్కించుకున్నారు. ఇవేమీ ఆశ్చర్యకరమైన ఫలితాలు కావు.

అధికార పార్టీకి ఈ మాత్రం లభించడం సాధారణ విషయమే. కానీ వరుస ఎదురు దెబ్బలతో చాలా బలహీనపడిందనుకుంటున్న బీఆర్ఎస్‌ పార్టీ ఇన్ని సీట్లు సాధించడం గమనార్హం.

ADVERTISEMENT

పంచాయితీ ఎన్నికలలో విజయం అంటే నేటికీ బీఆర్ఎస్‌ పార్టీకి గ్రామస్థాయిలో పూర్తి పట్టుందని స్పష్టమవుతోంది. కాంగ్రెస్‌ అస్తవ్యస్త పాలనతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, మార్పు కోరుకుంటున్నారని బీఆర్ఎస్‌ పార్టీ వాదనలలో ఎంతో కొంత వాస్తవం ఉందని ఈ ఫలితాలు చెపుతున్నాయి.

అయితే 50 శాతంపైగా ప్రజలు తమవైపే ఉన్నారని, ఈ ఎన్నికలతో కాంగ్రెస్‌ పార్టీకి తిరుగులేదని స్పష్టమైందని మంత్రులు చెప్పుకుంటున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా నేతలు, శ్రేణుల మధ్య సమన్వయ లోపం కారణంగానే బీఆర్ఎస్‌ పార్టీ ఇన్ని సీట్లు గెలుచుకుందని సర్ది చెప్పుకుంటున్నారు.

కానీ కాంగ్రెస్‌ మంత్రులు అధికార దుర్వినియోగానికి పాల్పడి, ప్రజలను, అభ్యర్థులను బెదిరించి భయపెట్టి, ప్రలోభాలకు గురి చేసినప్పటికీ ప్రజలు తమ పార్టీకి భారీగా పంచాయితీలు కట్టబెట్టారని, ఇది కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చెంపదెబ్బ వంటిదని బీఆర్ఎస్‌ పార్టీ వాదిస్తోంది. కనుక గట్టిగా కష్టపడితే మళ్ళీ పూర్వ వైభవం సాధించవచ్చని బీఆర్ఎస్‌ పార్టీ గ్రహించింది.

బీఆర్ఎస్‌ పార్టీ వాదనలు పూర్తిగా కొట్టిపడేయలేము. తీవ్ర సంక్షోభంలో చిక్కుకొని అల్లాడుతున్న బీఆర్ఎస్‌ పార్టీ ఇక తుడిచిపెట్టుకుపోయినట్లే అని కాంగ్రెస్‌ భావిస్తే, గ్రామస్థాయిలో మళ్లీ పుంజుకొని నిలబడింది. కనుక ఈ ఫలితాలతో కాంగ్రెస్‌ పార్టీకి మేల్కొలుపు వంటివే అని చెప్పవచ్చు. మరి మేల్కొంటుందో లేదో?

ADVERTISEMENT
Latest Stories