తెలంగాణలో ఈ రాజకీయ పరిస్థితికి కారణం కేసీఆరే?

Telangana Politics: Can BJP Benefit From BRS-Congress Rivalry?

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి 12 ఏళ్ళు. ఇంత తక్కువ సమయంలోనే నేడు ఈ స్థాయిలో రాజకీయాలు జరుగుతుండటం కాస్త ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఆంధ్రాలో ఇంతకంటే ఎక్కువగానే జరుగుతున్నాయి కదా? అని సందేహం కలుగవచ్చు. కానీ ఆంధ్రాలో ఒకవైపు వైసీపీ మరోవైపు కూటమి పార్టీలు మాత్రమే ఉన్నాయి.

ADVERTISEMENT

కానీ టీఆర్ఎస్‌ పార్టీతో సహా సుమారు అరడజను పార్టీలు పుట్టుకొచ్చాయి. రాజకీయాలలో ఇది సర్వసాధారణం అనిపించవచ్చు. కానీ రాష్ట్రం ఏర్పడిన పుష్కర కాలంలోనే ఇన్ని పార్టీలు పుట్టుకురావడం, కేసీఆర్‌ చావు కోరుకునే స్థాయికి రాజకీయాలు దిగజారడం ఆలోచింపజేస్తాయి.

తెలంగాణ ఏర్పాటు, అభివృద్ధితో పాటు ప్రస్తుత రాజకీయ పరిస్థితికి కూడా కేసీఆరే కారణమని చెప్పక తప్పదు. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్‌ నిరంకుశత్వం, బంధుప్రీతి, అభివృద్ధి పేరుతో అవినీతి, అక్రమాలు, ఫామ్‌హౌసుల వల్ల కాంగ్రెస్‌ పార్టీ మళ్ళీ పుంజుకోగలిగింది.

రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీలు ఉన్నప్పటికీ, రాష్ట్రంలో ఇంకా రాజకీయ శూన్యత ఉందని వాదిస్తూ టీఆర్ఎస్‌ వంటి కొత్త పార్టీలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. అయితే రాజకీయ శూన్యత ఉందా అంటే లేదని అందరికీ తెలుసు.

కానీ నాడు బీఆర్ఎస్‌, నేడు కాంగ్రెస్‌ పార్టీ హయంలో తెలంగాణ భారీగా దోపిడీకి గురవుతోందని ఆ పార్టీల నేతలే పరస్పరం ఆరోపించుకుంటున్నారు. తెలంగాణలో దోచుకోవడానికి ఇంకా పుష్కలంగా అవకాశాలు కనిపిస్తున్నందునే ప్రతీ ఒక్కరూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. బహుశః ఇదీ ఓ కారణం అయ్యుండవచ్చు.

అదే.. కేసీఆర్‌ ప్రజాస్వామ్యానికి కట్టుబడి రాజకీయాలలో హుందాతనం పాటిస్తూ, వీలైనంత వరకు పారదర్శకంగా పాలన సాగించి ఉండి ఉంటే, ప్రజలు మళ్ళీ ఆయనకే అధికారం కట్టబెట్టేవారు. నేడు తెలంగాణలో ఆయన చావు కోరుకునే స్థాయికి రాజకీయాలు దిగాజారేవే కావేమో?

కానీ నేటికీ అయన తీరు, అయన కుమారుడు కేటీఆర్‌ తీరు గానీ ఏమాత్రం మారలేదు. అదే… అహంభావం ప్రదర్శిస్తున్నారు.

కనుక వారి పోకడలు మరిన్ని కొత్త పార్టీల పుట్టుకకు లేదా సరికొత్త సమీకరణాలకు దోహదపతాయే తప్ప బీఆర్ఎస్‌ పార్టీకి పూర్వ వైభవం తెచ్చి పెట్టకపోవచ్చు. కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీల పాలను ప్రజలు చూసేశారు. కనుక వచ్చే ఎన్నికలలో బిజేపికి కూడా ఓ అవకాశం ఇచ్చి చూద్దామని తెలంగాణ ప్రజలు అనుకోవచ్చు. ఈ విషయం కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ రెండు పార్టీలకు బాగా తెలుసు.

ఇది వరకు అవకాశాన్ని చేజార్చుకున్నామని కానీ ఈసారి చేజార్చుకోబోమని ప్రధాని మోడీ స్వయంగా చెప్పి వెళ్ళారు కదా? కనుక ఇప్పటికైనా గాడిలో పడితే వాటికే మంచిది. లేకుంటే ఎప్పటికీ వాటికి మరో అవకాశం రాకపోవచ్చు.

ADVERTISEMENT
Latest Stories