తెలంగాణ సిఎం కేసీఆర్ టిడిపి ఎమ్మెల్యేలను టిఆర్ఎస్లోకి ఆకర్షించి రాష్ట్రంలో ఇక టిడిపి అనే పార్టీ లేదని వారిచేతే ప్రకటింపజేశారు. కానీ నేటికీ టిడిపి కొనసాగుతూనే ఉంది. తెలంగాణలో నేటికీ టిడిపి బలంగానే ఉందనే విషయం మునుగోడు ఉపఎన్నికల సమయంలో మరోసారి బయటపడింది. ఆ ఉపఎన్నికలలో టిడిపి పోటీ చేద్దామనుకొంటే బిజెపి అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజ్ఞప్తి మేరకు వెనక్కు తగ్గి ఆయనకు పరోక్షంగా సహకరించిందని టిఆర్ఎస్ మంత్రులే చెప్పుకొన్నారు. తెలంగాణలో టిడిపికి ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా ఇంకా దానిని చూసి టిఆర్ఎస్ ఆందోళన చెందుతోందంటే ఆశ్చర్యకరమే.
నిజానికి తెలంగాణ టిడిపి ఎప్పుడూ దాని ప్రత్యర్ధులకు ఆశ్చర్యకరంగానే నిలుస్తుంటుంది. 2014 ఎన్నికలప్పుడు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు హటాత్తుగా బీసీ నేత ఆర్.కృష్ణయ్యను పార్టీలోకి తీసుకొని ముఖ్యమంత్రి అభ్యర్ధి అని ప్రకటించి ప్రత్యర్దులకు పెద్ద షాక్ ఇచ్చారు. 2019 శాసనసభ ఎన్నికలలో ఎవరూ ఊహించనివిదంగా కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకొని మరో షాక్ ఇచ్చారు. ఆ రెండు వ్యూహాలు ఫలించలేదు. అది వేరే సంగతి.
చంద్రబాబు నాయుడు ఇప్పుడు మరో ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకొన్నారు మళ్ళీ. గతంలో టిడిపిలో పనిచేసి బయటకు వెళ్ళిపోయిన బీసీ నేత కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ను మళ్ళీ పార్టీలోకి ఆహ్వానించడమే కాక ఆయనకే తెలంగాణ టిడిపి పగ్గాలు అప్పగించారు. ఇది టిఆర్ఎస్కు పెద్ద షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే, కొన్ని రోజుల క్రితమే మంత్రి హరీష్ రావు, ఆ తర్వాత ఈటల రాజేందర్ ఆయన ఇంటికి వెళ్ళి తమ పార్టీలలో చేరాలని కోరారు.
తెలంగాణలో టిఆర్ఎస్, బిజెపిలు చాలా బలంగా, పోటాపోటీగా ఉన్నప్పటికీ టిడిపిలో చేరాలని నిర్ణయించుకోవడం విశేషం. సిఎం కేసీఆర్ ఎల్లప్పుడూ మాయమాటలు చెపుతూ బీసీలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకోవడం తప్ప వారి కోసం చేసిందేమీ లేదని జ్ఞానేశ్వర్ భావిస్తున్నారు. అలాగే బిజెపికి అధికార యావ, హిందుత్వ యావ తప్ప మరోటి లేదని గట్టిగా నమ్ముతుండటంతో ఆయన టిడిపిలో చేరేందుకు మొగ్గు చూపారు.
చంద్రబాబు నాయుడు కూడా చాలా దూరదృష్టితో ఆలోచించి, ఆయనను పార్టీలో చేర్చుకోవడమే కాకుండా పార్టీ పగ్గాలు కూడా అప్పగించారు. తెలంగాణలో బలమైన బీసీ నాయకుడిగా గుర్తింపు కలిగిన జ్ఞానేశ్వర్ రాష్ట్రంలో బీసీలను ఒక్కతాటిపైకి తీసుకువచ్చేందుకు చాలా కాలంగా కృషి చేస్తున్నారు. టిడిపి ఎల్లప్పుడూ బీసీలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుంటుంది కనుక తెలంగాణలో బీసీలు రాజకీయంగా ఎదుగుదలకు టిడిపి చాలా ఉపయోగపడుతుందని జ్ఞానేశ్వర్ చెపుతున్నారు. వచ్చే ఎన్నికలలోగా రాష్ట్రంలో మళ్ళీ టిడిపిని బలోపేతం చేసి, టిఆర్ఎస్, బిజెపిలకు ప్రత్యామ్నాయంగా తయారుచేయాలని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ భావిస్తున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు ఆయన చేతికి తెలంగాణ టిడిపి పగ్గాలు అప్పగించారు. ఇప్పటివరకు తెలంగాణ టిడిపి అధ్యక్షుడుగా వ్యవహరించిన బక్కని నరసింహులను టీడీపీ పొలిట్ బ్యూరోలోకి తీసుకొని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు.



