ఇటీవల విజయవాడ వరదలు వచ్చినప్పుడు మళ్ళీ వైసీపి బ్యాచ్ అమరావతిపై ఎంతగా దుష్ప్రచారం చేశారో అందరూ చూశారు. అమరావతిలో భవనాలన్నీ వరద నీళ్ళలో మునిగిపోయాయని, సచివాలయం ఉద్యోగులు, హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అక్కడి నుంచి పారిపోయారని వైసీపి దుష్ప్రచారం చేసింది.
వరద ఉదృతి పూర్తిగా తగ్గిపోయిన తర్వాత కూడా బుడమేరుకి మళ్ళీ గండి పడిందని, ఊళ్ళలోకి నీళ్ళు వచ్చేస్తున్నాయంటూ వైసీపి పుకార్లు పుట్టిస్తూ నీచాతి నీచ రాజకీయాలు చేసింది. వరద బాధితులకు సాయం అందించడంలో నిమాగ్నమైన టిడిపి కూటమి ప్రభుత్వం, ఆ దుష్ప్రచారాన్ని ఖండించడానికి కూడా సమయం కేటాయించవలసి వచ్చిందంటే పరిస్థితి అర్దం చేసుకోవచ్చు.
అమరావతి వ్యవహారాలను చూస్తున్న రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ వైసీపీకి ఊహించలేని సమాధానం చెప్పారు.
కృష్ణానదిలో 15 లక్షల క్యూసెక్కులు వరద వచ్చినా, కొండవీటివాగు, పాలవాగు పొంగి ప్రవహించినా తట్టుకునే విదంగా అమరావతి చుట్టూ మూడు భారీ జలాశయాలు నిర్మిస్తామని చెప్పారు. ఒకటి కొండవీటి వాగు వద్ద మరొకటి పాలవాగు వద్ద, మూడవది ఉండవల్లిలో వైకుంఠపురం వద్ద నిర్మిస్తామని చెప్పారు.
ఈ మూడు జలాశయాలు పనులకు రెండు నెలల్లో టెండర్లు పిలిచి వచ్చే ఏడాది వర్షాకాలం నాటికి వాటి నిర్మాణ పనులు పూర్తయ్యేలా చేస్తామని చెప్పారు. తద్వారా ఎంత వరద వచ్చినా నీళ్ళన్నీ ఆ మూడు జలాశయాలలోకి వెళ్ళిపోతాయని, అక్కడి నుంచి కాలువల ద్వారా రాజధాని చుట్టుపక్కల ప్రాంతాలలో పంట పొలాలకు నీళ్ళు అందించవచ్చని చెప్పారు. ఈ మూడు జలాశయాలలో నీటిని భవిష్యత్లో అమరావతి అవసరాలకు కూడా ఉపయోగించుకోవచ్చని మంత్రి నారాయణ చెప్పారు.
భారీ వర్షాలను, వరదలని ఎవరూ ఆపలేరు. కానీ ఈవిదంగా జలాశయాలు, బ్యారేజీలు, కాలువలు నిర్మించుకోవడం ద్వారా ఆ వరద నీటికి కూడా ఉపయోగించవచ్చనే చిన్న విషయం జగన్ ప్రభుత్వానికి కలుగలేదు. కలిగి ఉంటే వరదలలో విజయవాడ మునిగేదేకాదు. జగన్ దృష్టి ఎంతసేపు సంక్షేమ పధకాలతో ఓట్లు దండుకోవడం ఎలా? అనే దానిపైనే ఉండేది. కనుక ఇటువంటి ఆలోచనలు కలిగే అవకాశమే లేదు.
ఈసారి వరదలు వచ్చాయి కనుక వాటితో జగన్ బురద రాజకీయాలు చేయగలిగారు. కానీ టిడిపి కూటమి ప్రభుత్వం బుడమేరు ఆక్రమణలు తొలగించి, అమరావతి చుట్టూ ఈ మూడు జలాశయాలు నిర్మిస్తే, వైసీపికి దాని అధినేత జగన్కి ఇకపై ఇటువంటి ‘బురద రాజకీయాలు’ చేసే అవకాశం కూడా ఉండదు. అంటే ఒక దెబ్బకు మూడు పిట్టలన్న మాట!




