నేడు మీడియా సమావేశంలో సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఇద్దరూ తిరుమల ప్రసాదంలో కల్తీ నెయ్యి వివాదం గురించి చాలా లోతుగా మాట్లాడారు.
సిఎం చంద్రబాబు నాయుడు ‘తిరుమల పవిత్రతని దెబ్బ తీయడానికి జగన్ ప్రభుత్వం కుట్ర చేసిందని అంటే, స్వామివారిపై జగన్ ప్రభుత్వం పగ పట్టిందని డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఇద్దరూ చెప్పింది ఒకటే కానీ భిన్నంగా చెప్పారు.
తిరుమల పవిత్రతని దెబ్బ తీయడానికే జగన్ ప్రభుత్వం ఇన్ని అపచారాలు, అవినీతికి పాల్పడిందని ఆరోపించారు.
“నెయ్యిలో జంతువుల కొవ్వు కలవడం గురించి నేను మాట్లాడిన మాటలను ప్రశ్నిస్తున్నారు. కానీ రసాయనాలు, పామాయిల్తో కల్తీ నెయ్యి తయారు చేశారని సీబీఐ చెప్పింది కదా?దాని గురించి ఎవరూ ఎందుకు మాట్లాడరు? పరమ పవిత్రమైన స్వామివారి ప్రసాదంలో కెమికల్స్తో తయారు చేసిన నెయ్యి వాడటం తప్పు కాదా? మరి ఎందుకు తప్పు ఒప్పుకోరు?
ఇక్కడ చర్చించాల్సింది తిరుమలలో జరిగిన అవినీతి గురించి కాదు. తిరుమల పవిత్రతని ఎందుకు దెబ్బ తీశారనేదాని గురించే చర్చ జరగాలి,” అన్నారు సిఎం చంద్రబాబు నాయుడు.
తిరుమల పవిత్రతని వైసీపీ ఎందుకు దెబ్బ తీయాలనుకుందో మళ్ళీ చర్చ అనవసరం. కానీ తిరుమల ప్రతిష్టని ఇంతగా దెబ్బ తీసినా కూడా, నేటికీ వైసీపీ ఇంత నిర్భయంగా తిరుమల పేరుతో రాజకీయాలు చేస్తూనే ఉంది కదా?
అంటే తిరుమల పవిత్రతని కాపాడే బాధ్యత తమదే అని చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వం వైసీపీని కట్టడి చేయడంలో విఫలమైందనే కదా? కట్టడి చేసి ఉంటే వారు సిఎం చంద్రబాబు నాయుడుని వేలెత్తి చూపగలిగేవారా? కధ ఇంత వరకు వచ్చేదా?
చివరిగా ఒక మాట! కేసులతో ఇలాగే కాలక్షేపం చేస్తుంటే వివేకా హత్య కేసులో సాక్షులు ఒకరొకరు మరణించినట్లే, ఈ కేసుల్లో కూడా సతీష్ కుమార్ (పరకామణి కేసు)వంటివారు అనుమానాస్పద పరిస్థితిలో చనిపోతూనే ఉంటారని గ్రహిస్తే మంచిది.




