కల్తీ నెయ్యి వివాదంతో తిరుమల పవిత్రతకి, ప్రతిష్టకి భంగం కలగడం ప్రతీ భక్తుడిని చాలా బాధించింది. కానీ ఇకపై తిరుమల పవిత్రతకి, ప్రతిష్టకి భంగం కలగకుండా చూసుకుందామని సిఎం చంద్రబాబు నాయుడు స్వయంగా టిటిడికి ప్రతిపాదించడం చాలా అభినందనీయం.
ఆ మాటలు ఏదో మొక్కుబడిగా కాకుండా ఆచరణలో పెట్టి మరీ చూపారు. తిరుమల బ్రహ్మోత్సవాలకు ముందు ముఖ్యమంత్రి దంపతులు స్వామివారిని దర్శించుకొని ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ.
ఆ ప్రకారమే చంద్రబాబు నాయుడు దంపతులు ఇరువురూ వచ్చారు కానీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఎవరినీ వెంటబెట్టుకొని రాలేదు. చాలా నిరాడంబరంగా, భక్తిగా ఆ కార్యక్రమం పూర్తి చేసుకొని అతిధి గృహానికి చేరుకున్న తర్వాత టీటీడీ అధికారులతో సిఎం చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు.
ఇక నుంచి తిరుమలలో ఇదే పద్దతి కొనసాగాలని, వీఐపీలు వచ్చినా ఎటువంటి హడావుడి చేయరాదని వారికి సూచించారు.
ప్రసాదం తయారీకయ్యే ఖర్చు లెక్కలు చూసుకోవడం ముఖ్యం కాదని భక్తులు సంతృప్తి, నాణ్యత చాలా ముఖ్యమని అన్నారు. కనుక ఇకపై ప్రసాదం తయారీ, దానికి వినియోగించే సరుకులు విషయంలో మరింత శ్రద్ద వహించాలని అన్నారు. ఇకపై ప్రసాదం నాణ్యత, రుచి విషయంలో పిర్యాదులు వస్తే సహించబోనని సిఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
తిరుమల కొండపై కేవలం గోవిందనామాలు, స్వామివారి కీర్తనలు మాత్రమే వినిపడాలని సిఎం చంద్రబాబు నాయుడు సూచించారు. టిడిపి మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలకు తాను చెప్తానని, ఇతర పార్టీల నేతలకు కూడా టీటీడీ చెపుతుండాలని సిఎం చంద్రబాబు నాయుడు చెప్పారు.
తిరుమల పవిత్రత, ప్రతిష్ట పెంచేవిదంగా టీటీడీ అధికారులు, ఉద్యోగుల నడవడిక ఉండాలని, అందుకు భిన్నంగా ఉన్నట్లు పిర్యాదులు వస్తే చర్యలు తీసుకోవడానికి వెనకాడనని సిఎం చంద్రబాబు నాయుడు సున్నితంగా హెచ్చరించారు.
సిఎం చంద్రబాబు నాయుడు చెప్పాల్సిన విషయాలన్నీ చాలా స్పష్టంగానే చెప్పారు. ఆచరణలో పాటించి చూపారు కూడా. కనుక టిడిపి కూటమి, ప్రభుత్వంలో అందరూ వాటికి కట్టుబడి ఉంటారని ఆశిద్దాం.




