గత రెండు వారాలుగా తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం జాతీయస్థాయిలో హైలైట్గా నిలిచింది. ఈ వ్యవహారంలో టిడిపి, వైసీపిలు రెండూ గోల్స్ చేశాయి. సెల్ఫ్ గోల్స్ కూడా చేసుకున్నాయి.
ఈ వ్యవహారంలో టిడిపి కూటమి ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిందని వైసీపి గొప్పగా చెప్పుకొంటే, తిరుమల డిక్లరేషన్ ఇచ్చేందుకు భయపడి జగన్ పర్యటన రద్దు చేసుకుని సెల్ఫ్ గోల్ చేసుకున్నారని టిడిపి ఎద్దేవా చేసింది.
కనుక రెండు పార్టీలు సున్నితమైన ఈ అంశంలో నుంచి త్వరగా బయటపడాలనే కోరుకొంటున్నాయి. కానీ దీనిని అకస్మాత్తుగా ముగించడం సాధ్యపడదు కనుక రెండు పార్టీలు ఈ ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయి.
కానీ నిన్న తెలంగాణ మంత్రి కొండా సురేఖ బిఆర్ఎస్ నేత కేటీఆర్-అక్కినేని కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేయడంతో మీడియాకు మరో కొత్త హాట్ టాపిక్ దొరికింది. కనుక ఇప్పుడు మీడియా ఆ అంశాన్ని భుజానికి ఎత్తుకుని స్పైసీ కధలు చెప్పడం ప్రారంభించాయి.
దీంతో ప్రజల దృష్టి చేతిలో ఉన్న లడ్డూ మీద నుంచి ఆ అంశంపైకి మళ్ళింది. ఇది టిడిపి, వైసీపిలకు చాలా ఉపశమనం ఇచ్చేదే.
అయితే ముళ్ళ కిరీటం ఒకరి నెత్తి మీద నుంచి మరొకరి నెత్తికి మారింది. కనుక ఇప్పుడు దానిని పెట్టుకొని కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు గేమ్ మొదలుపెట్టాయి. వాటి మద్యలో టాలీవుడ్ హీరోలు కూడా కత్తులు పట్టుకొని దిగుతున్నారు. కనుక మరో కొత్త టాపిక్ దొరికే వరకు ఈ కధ రసవత్తరం సాగుతుంది.
కనుక ఇక టిడిపి, వైసీపిలు తిరుమల స్వామివారి జోలికి, లడ్డూ జోలికి వెళ్లకుండా బుద్ధిగా రొటీన్ రాజకీయాలు చేసుకుంటే వాటికే మంచిది.




