ఇటీవల కాలంలో కాస్త సర్ధుమణిగినట్లుగా ఉన్న చిన్న సినిమాల ధియేటర్ల విషయం మళ్ళీ ఒక్కసారిగా తెరపైకి వచ్చింది. గతంలో నట్టికుమార్ వంటి పలువురు చిన్న సినిమాల నిర్మాతలు… “ఆ నలుగురు తమ సినిమాలకు ధియేటర్లు లేకుండా చేస్తున్నారని” తీవ్ర ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత ఈ విషయంపై ఎక్కడా ప్రస్తావన లేకపోవడంతో… చిన్న – పెద్ద సినిమాల వివాదానికి శుభంకార్డు పడిందని అంతా భావించారు.
కానీ, తాజాగా విడుదలకు సిద్ధంగా ఉన్న “ఫ్రెండ్ రిక్వెస్ట్” సినిమాతో మరోసారి ఈ వివాదం తెలుగు సినీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. సరిపడనన్నీ ధియేటర్లు లభించకపోయినప్పటికీ, కొన్ని ధియేటర్ల యాజమాన్యాలతో సంప్రదింపులు జరిపి, ఈ సినిమా విడుదలకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసామని, అయితే చివరి నిముషంలో ముందుగా ఒప్పందం చేసుకున్న ధియేటర్ల యాజమాన్యాలు కూడా మాట మార్చేసాయని… హైదరాబాద్, జూబ్లీహిల్స్ ఫిలిం చాంబర్ ఎదుట ‘ఫ్రెండ్ రిక్వెస్ట్’ సినీ నిర్మాతలు ఆందోళనకు దిగారు.
ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు సి.కళ్యాణ్, మరో హీరో ఆదిత్య ఓం తదితరులు ఫిలిం చాంబర్ ఎదుట హాజరై ‘ఫ్రెండ్ రిక్వెస్ట్’ నిర్మాతలకు సంఘీభావం తెలిపారు. మళ్ళీ రాజుకున్న “ఆ నలుగురు” వివాదానికి ఈ సారి ఎలాంటి క్లైమాక్స్ ఉంటుందో చూడాలి. అయితే ‘ఫ్రెండ్ రిక్వెస్ట్’ నిర్మాతలు మాత్రం ‘ఆ నలుగురు’ అంటూ ఎవరిపైన అభియోగాలు చేయడం లేదు గానీ, తమకు సరిపడినన్ని ధియేటర్లు ఇచ్చి న్యాయం చేయాలని కోరుతున్నారు. అయితే ఇది కూడా పబ్లిసిటీ స్టంట్ లో ఒక గేమ్ అని కొట్టిపాడేసేవారు లేకపోలేదు.



