తెలంగాణ సిఎం కేసీఆర్ ఇటీవల పార్టీ సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతూ తన కుమార్తె కల్వకుంట్ల కవితని కూడా బిజెపిలో చేరాలని ఒత్తిడి చేశారని చెప్పడం సంచలనం సృష్టించింది. బిజెపి తన కుటుంబ సభ్యులను కూడా చీల్చేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కనుక పార్టీలో అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.
కేసీఆర్ బయటపెట్టిన ఈ రహస్యాన్ని ఆ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ వెంటనే ఖండించారు. ఢిల్లీ పెద్దల చుట్టూ పదేపదే ప్రదక్షిణాలు చేసినా కేసీఆర్నే బిజెపి పట్టించుకోలేదని, ఇక ఆయన కుమార్తె కవిత మాకెందుకని బండి సంజయ్ ప్రశ్నించారు.
కల్వకుంట్ల కవిత ఈరోజు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియో సందేశంలో “అవును నన్ను బిజెపిలో చేరమని మద్యవర్తుల ద్వారా ఒత్తిడి చేసిన మాట వాస్తవం. అయితే నేను తెలంగాణ ప్రజలకు, పార్టీకి ద్రోహం చేయలేనని సవినయంగా తిరస్కరించాను. నేను ఇంకా చాలాకాలం రాజకీయాలలో ఉండాలనుకొంటున్నాను. కనుక నేను రాజకీయాలలో నిజాయతీగా ఉండాలని కోరుకొంటున్నాను. కానీ కేంద్రం ఒత్తిడికి తలగ్గొకపోతే ఏం చేస్తుందో అందరూ చూస్తూనే ఉన్నారు. ఈడీ, ఐటి, సీబీఐలను వారిపైకి ఉసిగొల్పి వేదిస్తోంది. ప్రత్యక్ష రాజకీయాలలో ఉన్న మావంటివారికి ఇవన్నీ ఎదుర్కోక తప్పదు కనుక ధైర్యంగా ఎదుర్కొంటాను,” అని చెప్పారు.
కేసీఆర్ కుటుంబ సభ్యుల మద్య విభేదాలున్నాయని బిజెపి కూడా గుర్తించినందునే ఇటువంటి సాహసం చేసిందని అర్దం అవుతోంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా రెండుసార్లు వరుసగా టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ కల్వకుంట్ల కవితకి ఇంతవరకు మంత్రి పదవి లభించకపోవడంపై అసంతృప్తిగా ఉన్నారనే గుసగుసలు అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి.
కేసీఆర్ కుటుంబంపై ఈగ వాలితే విరుచుకుపడే టిఆర్ఎస్ నేతలు, ముఖ్యంగా ఆమె సోదరుడు, మంత్రి కేటీఆర్ ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆమె పేరు వినబడినప్పుడు ఎవరూ మీడియా ముందుకు వచ్చి ఆమెకు మద్దతుగా మాట్లాడలేదు. ఇటీవల ఆమె తండ్రి కేటీఆర్ టిఆర్ఎస్ని బిఆర్ఎస్గా మార్చుతున్నప్పుడు ఆ కార్యక్రమానికి పార్టీలో ప్రతీఒక్కరూ హాజరయ్యారు ఆమె తప్ప!
ఈ పరిణామాలన్నీ కేసీఆర్ కుటుంబంలో ఎంతో కొంత మేర విబేధాలున్నాయని స్పష్టం చేస్తున్నాయి. అయితే కేసీఆర్ బిజెపిని ఎండగట్టే ప్రయత్నంలో తన కూతురినే బిజెపిలో చేర్చుకోవాలని ప్రయత్నిస్తోందంటూ బయటపెట్టడం పెద్ద పొరపాటనే చెప్పవచ్చు. ఆయన ఈ విషయం బయటపెట్టకపోయుంటే బిజెపి కూడా బయటపడేదే కాదు కదా?కనుక కేసీఆర్ స్వయంగా ఈ విషయాన్ని బయటపెట్టుకొని బిజెపికి దొరికిపోయారని చెప్పవచ్చు.
నిజామాబాద్ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ “కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో ఫోన్లో మాట్లాడారంటూ ఈరోజు మరో బాంబు పేల్చారు. కొద్ది సేపటి క్రితమే టిఆర్ఎస్ శ్రేణులు నిజామాబాద్లో ఆయన ఇంటిపై కర్రలు, రాళ్ళతో దాడులు చేశాయి కూడా.
ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కేసీఆర్ కుటుంబం, ఇప్పుడు కల్వకుంట్ల కవిత పార్టీ మారే వ్యవహారం రచ్చరచ్చ అవుతుండటం మరో తలనొప్పిగా మారింది.



