అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్కి లాస్ట్ వార్నింగ్ ఇచ్చేశారు. సోమవారం సాయంత్రంలోగా హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరవకపోతే ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తామని, ముందుగా అతిపెద్ద విద్యుత్ కేంద్రంపై దాడి చేస్తామని హెచ్చరించారు.
ఇరాన్తో యుద్ధం మొదలుపెట్టి మూడు వారాలు. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయోతుల్లా ఖమేనీని చంపేస్తే, వెంటనే ఇరాన్ లొంగిపోతుందని ట్రంప్ కూడా అనుకోలేదు.
కానీ తనకున్న ఆయుధ బలంతో మూడు నాలుగు వారాలలో ఇరాన్ని పూర్తిగా లొంగదీసుకోవచ్చనే భ్రమతో యుద్ధం మొదలుపెట్టి ఇప్పుడు దానిని కొనసాగించలేక, బయటపడలేక అడ్డంగా దొరికిపోయారు.
ఈ యుద్ధం కోసం ప్రతీరోజూ మిలియన్ల డాలర్లు ఆవిరైపోతున్నాయి. అత్యాధునిక యుద్ధవిమానాలు కూలిపోతూనే ఉన్నాయి. ఇంకా ఎంతకాలం ఈ యుద్ధం సాగుతుందో తెలీని పరిస్థితిలో ట్రంప్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు.
ఇందుకు తాజా నిదర్శనమే ఈ బెదిరింపు. హర్మూజ్ జలసంధిని తెరిచి స్వాధీనం చేసుకునేందుకు తాను చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదని ఈ బెదిరింపుతో ట్రంప్ స్వయంగా చాటింపు వేసుకున్నట్లయింది.
ఒకవేళ అమెరికా, ఇజ్రాయెల్తో ఇరాన్ ప్రత్యక్ష యుద్ధం మాత్రమే చేసి ఉండి ఉంటే, ట్రంప్ ఊహించినట్లు ఈపాటికి ఇరాన్ అయన చేతికి వచ్చేసేది. కానీ ట్రంప్ ఉచ్చులో ఇరాన్ పడలేదు. దాని ఉచ్చులోనే ట్రంప్ పడ్డారు.
ఇరాన్ సుప్రీం కమాండర్ వారసుడు మోజ్తాబా ఖమేనీ పగ్గాలు చేపట్టగానే యుద్ధ వ్యూహాలు సమూలంగా మార్చేశారు. ముందుగా ప్రపంచదేశాల చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిని పూర్తిగా కట్టడి చేశారు.
దీంతో చమురు కోసం ప్రపంచ దేశాలు ట్రంప్పై ఒత్తిడి పెరిగిపోయింది. అందుకే దానిని తెరిపించేందుకు తిప్పలు పడుతున్నారు. కుదరకపోవడంతో చివరికి ఇలా బెదిరింపులకు దిగారు!
అలాగే అమెరికా సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతించినందుకు గల్ఫ్ దేశాల చమురు బావులు, కీలక ప్రాంతాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. దాంతో ఆ దేశాలు కూడా ట్రంప్ మీద గుర్రుగా ఉన్నాయి. ట్రంప్ మీద వాటి ఒత్తిడి కూడా చాలా ఉంది.
కనుక వీలైనంత త్వరగా హర్మూజ్ జలసంధి తెరిపించి, యుద్ధం ముగించేయాలని ట్రంప్ ఆరాటపడుతున్నారు. కానీ “అమెరికా మొదలుపెట్టిన యుద్ధం మేమే మాకు నచ్చినట్లు ముగిస్తామని” ఇరాన్ స్పష్టం చేసింది.
కనుక ట్రంప్ చేతికి, కాలికి అంటుకున్న ఇరాన్ చమురు జిడ్డు అంత త్వరగా వదలకపోవచ్చు.




