దాదాపు ఏడాది నుంచి ఒక్కో సమయంలో ఒక్కో ప్రముఖుడు లేదా పరిణామాలు హైలైట్ అవుతున్నాయి. గత ఏడాది సుంకాలు, హెచ్1 బీ వీసాల వ్యవహారాలతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యావత్ ప్రపంచం దృష్టి ఆకర్షించారు. ట్రంప్ నిర్ణయాలతో యావత్ ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్స్ తీవ్రంగా నష్టపోయాయి.
ఆ తర్వాత ‘ఆపరేషన్ సింధూర్’తో భారత్-పాక్ మద్య నాలుగు రోజుల పాటు జరిగిన యుద్ధ వార్తలు, ప్రధాని మోడీ పేరు మారు మ్రోగిపోయింది. ఆ తర్వాత మళ్ళీ అమెరికా-ఇరాన్ యుద్ధ వార్తలతో ట్రంప్ పేరు మళ్ళీ మారుమ్రోగిపోయింది. ఈ యుద్ధం వలన భారత్లో గ్యాస్ సిలిండర్స్ కొరత ఏర్పడటం, హోటల్స్ వగైరా మూతపడుతుండటం, బ్లాకులో సిలిండర్స్ విక్రయాలు, పెట్రోల్, డీజిల్ కొరత వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ యుద్ధం వలన మళ్ళీ ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్స్ తీవ్రంగా నష్టపోయాయి.
కోలీవుడ్ హీరో విజయ్ దళపతి నటించిన చివరి సినిమా జన నాయగన్ ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉండగా సెన్సార్ అభ్యంతరాలతో నిలిచిపోవడంపై సినీ, రాజకీయ కోణాలలో జోరుగా చర్చలు సాగాయి.
ఆ తర్వాత తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుతో కల్వకుంట్ల కవిత పేరు ఓ రెండు మూడు వారాలపాటు మారుమ్రోగిపోయింది.
తర్వాత శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి పశ్చిమ బెంగాల్, తమిళనాడులో జరుగుతున్న రాజకీయ పరిణామాలు అందరి దృష్టిని ఆకర్షించాయి.
పశ్చిమ బెంగాల్లో తొలిసారిగా బిజేపి భారీ మెజార్టీతో అధికారంలోకి రావడంపై సర్వత్రా చర్చ జరిగింది. ఇదే సమయంలో తమిళనాడు ఎన్నికలలో కోలీవుడ్ హీరో విజయ్ దళపతి తొలి ప్రయత్నంలోనే ఏకంగా 108 సీట్లు గెలుచుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. టీవీకే పార్టీ ఇన్ని సీట్లు గెలుచుకోవడం దేశ ముదురు డీఎంకే, అన్నాడీఎంకేలు ఓడిపోవడం ఆశ్చర్యకరంగా నిలిచింది.
ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పటికీ సిఎం మమతా బెనర్జీ పదవికి రాజీనామా చేసేందుకు నిరాకరించడం, మరోపక్క తమిళనాడు గవర్నర్ ఆర్లేకర్ విజయ్ని ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానించేందుకు నిరాకరించడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నేటికీ ఈ డ్రామా కొనసాగుతూనే ఉండగా మళ్ళీ అమెరికా-ఇరాన్ పరస్పర దాడులతో యుద్ధ వార్తలు వినిపిస్తున్నాయి.
ఒక ఏడాది వ్యవధిలో దేశంలో, ప్రపంచంలో ఇన్ని సంచలన పరిణామాలు జరుగడం విచిత్రమేమీ కాదు కానీ చాలా ఆసక్తికరమే కదా?




