ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ల సోషల్ మీడియా అకౌంట్లను ‘అవర్ మైన్ గ్రూప్’ హ్యాక్ చేసి కలకలం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా ట్విట్టర్ సీఈవో జాక్ డార్సీ ట్విట్టర్ అకౌంట్ ను కూడా హ్యాక్ చేసి మరోసారి తమ సత్తాను చాటుకున్నారు. తామే హ్యాక్ చేసినట్లుగా అదే అకౌంటు నుండి ‘అవర్ మైన్ గ్రూప్’ ప్రకటించింది.
హ్యాక్ అయిన జాక్ డార్సీ ట్విట్టర్ అకౌంట్ లో మొత్తం 3.73 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉండడంతో, అందరికీ ఈ సమాచారం చేరినట్లయ్యింది. వెంటనే స్పందించిన ట్విట్టర్ సిబ్బంది ఆయన అకౌంటును పునరుద్ధరించి, ఆ ట్వీట్ ను తొలగించారు. అయితే ఇలా హ్యాక్ చేయడం ద్వారా తాము చౌర్యానికి పాల్పడడం లేదని, ఆయా సేవల్లో లోపాలు తెలపడమే తమ ఉద్దేశ్యమని ‘అవర్ మైన్ గ్రూప్’ చెబుతోంది.
‘అవర్ మైన్ గ్రూప్’ అనేది ఒక సైబర్ భద్రతా సంస్థ అని, ఎలాంటి లోపాలు లేని సేవలందించడమే తమ లక్ష్యమని, వివిధ భద్రతా సేవలను తాము అందిస్తున్నామని వారు పేర్కొంటున్నారు. అయితే హ్యాక్ చేసిన ఫేస్ బుక్, గూగుల్, ట్విట్టర్ వంటి సీఈవోల ఎకౌంటులే హ్యాకింగ్ బారిన పడితే ఇక సామాన్యుల పరిస్థితి ఏం కానూ? వారి ఎకౌంటులకు భద్రత ఎక్కడుంది? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.



