తమిళనాడు సిఎం విజయ్ నేడు మాజీ సిఎం స్టాలిన్ని మర్యాదపూర్వకంగా కలిసేందుకు వచ్చినప్పుడు, ఆయన కుమారుడు, మాజీ మంత్రి ఉదయనిది స్టాలిన్ ‘ప్రజల మద్య చిచ్చు పెడుతున్న సనాతన ధర్మాన్ని అంతం చేయాలి” అంటూ ఓ అనుచిత విజ్ఞప్తి చేశారు.
తమిళనాడు రాష్ట్రం నిండా అనేక ప్రసిద్ద పుణ్యక్షేత్రాలున్నాయి. ప్రతీ సందులో ఓ గుడి తప్పక కనిపిస్తుంది. తమిళులు కులాలు వేరైనా అందరూ భక్తితో వాటిని దర్శించుకొని పూజలు చేసుకుంటారు. తమిళులను కలిపేవి ఆ సంస్కృతీ సంప్రదాయాలు, భాష, ఆచార వ్యవహారాలే. సమాజం ప్రశాంతంగా ఉండేందుకు తోడ్పడుతున్న వాటిని సనాతన ధర్మం పేరుతో వ్యతిరేకించాల్సిన అవసరమే లేదు.
కాంగ్రెస్ పార్టీ కుహనా లౌకికవాదంతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుంటే అంగీకరిస్తున్న ద్రవిడ పార్టీలు సనాతన ధర్మం పేరుతో బిజేపి తమిళనాడులో చొచ్చుకుపోయి తమ ఓటు బ్యాంకులు కొల్లగొడుతుందని భయపడుతుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.
ద్రవిడ పార్టీలు హిందీ పేరుతో రాజకీయాలు చేస్తూ రెండు జాతీయ పార్టీలను కొంత మేర కట్టడి చేయగలుగుతున్నాయి. కానీ వాస్తవం ఏమిటంటే, కాంగ్రెస్, బిజేపి అగ్రనేతలకు తమిళ భాష రాకపోవడమే ఆ రాష్ట్రంలో వారి పార్టీలకు పెద్ద అడ్డుగోడగా నిలుస్తోందని చెప్పవచ్చు. అదే.. ప్రధాని మోడీ, అమిత్ షా, కేంద్ర మంత్రులు, సోనియా, రాహుల్ తదితర కాంగ్రెస్ నేతలకు తమిళంలో మాట్లాడటం వచ్చి ఉండి ఉంటే ఈ పాటికి ఆ రెండు పార్టీలు తమిళనాడులో అధికారంలోకి వచ్చి ఉండేవే కదా?
అయినప్పటికీ ద్రవిడ పార్టీలు తమ పార్టీ, రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం ముందుచూపుతో ఈవిధంగా సనాతన ధర్మం పేరుతో మరో రక్షణ గోడ కూడా నిర్మించుకునే ప్రయత్నం చేస్తున్నాయని చెప్పక తప్పదు.
కనుక ద్రవిడ పార్టీలు హిందీని లేదా సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నాయా అంటే కాదు.. వాటిని కాంగ్రెస్, బిజేపిలకు ఆపాదించి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పవచ్చు.
కానీ ఆ రెండు పార్టీలు వద్దనుకుంటే అదే విషయం కేసీఆర్లా ధైర్యంగా చెప్పి వాటిని రాజకీయంగా ఎదుర్కొని రాష్ట్రంలో అడుగుపెట్టకుండా అడ్డుకోవచ్చు కదా?మద్యలో హిందీ, సనాతన ధర్మాన్ని లాగడం దేనికి? అవి అందరికీ ఎంతో కొంత మేలే చేస్తాయి తప్ప హానీ చేయడం లేదు కదా?




