రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులకు నెలనెలా జీతాలు చెల్లించలేని దుస్థితికి వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ దయనీయ పరిస్థితికి ఇది అద్దం పడుతోంది. రాష్ట్ర విభజన తర్వాత చేతిలో టిడిపి ప్రభుత్వం చేతిలో చిల్లిగవ్వ కూడా లేని పరిస్థితుల్లో కూడా జీతాల చెల్లింపులో ఆలస్యం జరగలేదని ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులే చెపుతున్నారు. కానీ మూడున్నరేళ్ళ పాలనలో రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందిపోతోందని, కొన్ని ఇతరన రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితి అద్భుతంగా ఉందని శాసనసభలోనే సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకొన్నారు కూడా. కానీ నెలనెలా జీతాలు చెల్లించలేకపోతోందంటే తాము ఇతర డిమాండ్స్ కోసం ఒత్తిడి చేయకుండా ఆపేందుకే ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా జీతాలు ఆలస్యంగా చెల్లిస్తోందేమో?అని ఉద్యోగ సంఘాల నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఎప్పటికీ ఇలాగే 15,20 తేదీల వరకు తమకు జీతాలు చెల్లించకుండా కాలక్షేపం చేసేయాలని ప్రభుత్వం అనుకొంటే తాము న్యాయపోరాటం చేయడానికి వెనకాడబోమని ఉద్యోగ సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు. ఈ జీతాల చెల్లింపు సమస్యతో పాటు, పీఆర్సీ, డీఏ, సెలవుల బకాయిల చెల్లింపులపై వారు ప్రభుత్వానికి సంక్రాంతి వరకు గడువు విధించారు. ఒకవేళ సంక్రాంతిలోగా ఈ సమస్యలన్నీ పరిష్కరించకపోతే మళ్ళీ ఆందోళన బాట పడతామని ఏపీ ఉద్యోగ సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వచ్చే ఏడాది జూలై నుంచే 12వ పీఆర్సీని ఉద్యోగుల ఖాతాలో నేరుగా జమా చేయాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ నెల నుంచే ఉద్యామిస్తామని ప్రకటించారు.
తమ సమస్యలకు సజ్జల రామకృష్ణారెడ్డి చేత సమాధానం చెప్పించడం కాదని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ స్వయంగా వచ్చి నిర్ధిష్టమైన సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రివర్గ ఉపకమిటీ చర్చల పేరుతో తమ సమస్యలను పరిష్కరించకుండా కాలక్షేపం చేసేయాలని ఆలోచిస్తున్నట్లయితే తాము కూడా కార్యాచరణ ప్రకటించవలసి వస్తుందని హెచ్చరించారు.
అయితే ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు ఎన్ని హెచ్చరికలు చేసినా ప్రభుత్వం వద్ద సంక్షేమ పధకాలకి తప్ప జీతాలకి డబ్బు ఉండట్లేదు. కనుక ప్రభుత్వం సంక్షేమ పధకాలకు కోత విధిస్తే తప్ప ఈ సమస్యకి పరిష్కారం దొరకకపోవచ్చు. కానీ సంక్షేమ పధకాలతోనే వచ్చే ఎన్నికలలో గెలిచి మళ్ళీ అధికారంలో కొనసాగుదామని సిఎం జగన్మోహన్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారు కనుక ఎట్టి పరిస్థితులలో వాటిని ఆపేందుకు అంగీకరించరని వేరే చెప్పకరలేదు.
కనుక ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయుల జీతాల సమస్య వచ్చే ఏడాది కూడా ఇలాగే కొనసాగవచ్చు. జీతాల కోసమే వారు పోరాడవలసివస్తున్నప్పుడు ఇక డీఏ బకాయిలు, పీఆర్సీల గురించి ఎలా పోరాడగలరు?కానీ పోరాడకపోతే అవి ఎన్నటికీ రావు. కనుక 2023 ఇటు ప్రభుత్వానికి, అటు ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులకి కూడా సంకట పరిస్థితులు తప్పకపోవచ్చు.



