మాజీ ఎమ్మెల్యే, టిడిపి నేత వంగవీటి రాధకృష్ణ ఎట్టకేలకు పెళ్ళి చేసుకోబోతున్నారు. ఇంతకాలం రాజకీయాలతోనే గడిపేసిన వంగవీటి రాధాకృష్ణ పెళ్ళి ఆలోచన చేయలేదు. కానీ ఆత్మీయులు, బంధుమిత్రుల సలహాను మన్నించి ఎట్టకేలకు 44 ఏళ్ళ వయసులో పెళ్ళి పీటలు ఎక్కబోతున్నారు.
నిన్న ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో వంగవీటి రాధాకృష్ణ, పుష్పవల్లిల వివాహ నిశ్చితార్ధం జరిగింది. అక్టోబర్ 22వ తేదీ సాయంత్రం 7.59 గంటలకు వారి వివాహం జరుగబోతోంది. వీరి వివాహ నిశ్చితార్ద కార్యాక్రమానికి మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, ప్రభుత్వ చీప్ విప్, ముదునూరి ప్రసాదరాజు, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, ఇరు కుటుంబాల బంధుమిత్రులు హాజరయ్యారు.
వధువు జక్కం పుష్పవల్లి నర్సాపురం పట్టణానికి చెందిన జక్కం బాబ్జీ, అమ్మణి దంపతుల కుమార్తె. ఆమె హైదరాబాద్లో ఉన్నత విద్యాభ్యాసం పూర్తిచేసి, కొంతకాలం యోగా టీచరుగా పనిచేశారు. ప్రస్తుతం నర్సీపట్నంలోనే ఓ విద్యాసంస్థను నిర్వహిస్తున్నట్లు సమాచారం.
ఆమె తండ్రి జక్కం బాబ్జీ ఏలూరు మాజీ మున్సిపల్ ఛైర్మన్గా పనిచేశారు. పుష్పవల్లి తల్లితండ్రులు మొదట టిడిపిలోనే ఉండేవారు. ప్రస్తుతం జనసేన పార్టీలో ఉన్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ నర్సీపట్నంలో పర్యటించినప్పుడు వీరి ఇంట్లోనే రెండు రోజులు బస చేశారు.
వంగవీటి రంగా తనయుడైన వంగవీటి రాధకృష్ణ గురించి అందరికీ తెలిసిందే. ఆయన 2024 ఎన్నికలలో విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేయాలనుకొంటున్నారు. ఈసారి ఎన్నికలలో టిడిపి, జనసేనలు కలిసి పనిచేయాలనుకొంటున్నట్లు వార్తలు వస్తున్న సమయంలో టిడిపికి చెందిన వంగవీటి రాధాకృష్ణ, జనసేనకు చెందిన జక్కం బాబ్జీ దంపతుల కుమార్తె పుష్పవల్లిని వివాహం చేసుకోబోతుండటంతో రెండు పార్టీలు వియ్యం అందిన్నట్లవుతుంది.



