ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎరుపు రంగు దుస్తులు ధరించి, తన ఇద్దరు కూతుర్లతో కలిసి బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అప్పుడు ఓ ఎరుపు రంగు పుస్తకాన్ని స్వామివారి పాదాల చెంత ఉంచారు. దానిపై ‘వారాహి డిక్లరేషన్’ అని ముద్రించి ఉంది. అసలు ఆ పుస్తకాన్ని ఎప్పుడు ముద్రింపజేశారో… దానిలో ఏముందో జనసేనలో ఆయన సన్నిహితులకు కూడా తెలియదు. పవన్ కళ్యాణ్ ఆలయంలో వెలుపలకి వస్తున్నప్పుడు ఆయన చేతిలో ఉన్న ఆ పుస్తకాన్ని భక్తులు అందరూ కూడా చూశారు.
ఈరోజు సాయంత్రం తిరుపతి ఎస్వీ కళాశాల మైదానంలో జనసేన అధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరుగబోతోంది. దానిలో పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు. బహుశః దానిలో ‘వారాహి డిక్లరేషన్’ గురించి ఆయనే స్వయంగా చెప్పే అవకాశం ఉంది.
తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడిన్నట్లు తెలిసినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ గురించి గట్టిగా మాట్లాడుతున్నారు. ఇటీవల తమిళ తంతీ న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా హిందూ దేవాలయాల పరిరక్షణ గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. సనాతన ధర్మ పరిరక్షణకి ఓ ప్రత్యేక బోర్డు అవసరమని, తాను స్వయంగా పూనుకొని పనిచేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు. కనుక దానికి సంబందించినదే ఈ ‘వారాహి డిక్లరేషన్’అయ్యుండవచ్చు.
పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమలో, ఆ తర్వాత రాజకీయాలలో ఈ స్థాయికి చేరుకోవడానికి ఎంతగానో శ్రమించారు. రాజకీయాలలో ఈ స్థాయికి చేరుకున్న తర్వాత ఇప్పుడు తనని తాను నిరూపించుకోవలసి ఉండగా, పవన్ కళ్యాణ్ మళ్ళీ మరో కొత్త మార్గంలో ముందుకు ప్రయాణించాలని అనుకుంటే ఇన్నేళ్ళ వ్యయప్రయాసలు అన్నీ వృధా అవుతాయి. కనుక పవన్ కళ్యాణ్ నేటి సభలో ఏం చెప్పబోతున్నారనేది చాలా ఆసక్తికరంగా మారింది.




