ఆదివారం సాయంత్రం 4 గంటలకు కేంద్ర ఎన్నికల కమీషన్ ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తమిళనాడుతో సహా మూడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తున్నారు. ఏప్రిల్ 23న తమిళనాడు ఎన్నికలు జరుగబోతున్నట్లు ఈసీ ప్రకటించింది.
సినిమాలకు గుడ్ బై చెప్పి టీవీకే పార్టీతో ఈ ఎన్నికల బరిలో దిగుతున్న విజయ్ తాము ఒంటరిగా పోటీ చేస్తామని, ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోమని ఇటీవలే చెప్పారు. కానీ ఓ పక్కపొత్తులు ఉండవని టీవీకే అధినేత విజయ్ చెపుతుంటే, విజయ్తో బిజేపి అధిష్టానం పొత్తుల చర్చలు కొలిక్కివస్తున్నాయంటూ వార్తలు వస్తుండటం విశేషం. తమిళనాడు శాసనసభలో 234 సీట్లున్నాయి. వాటిలో 80 సీట్లు టీవీకే పార్టీకిస్తామని, విజయ్కు డెప్యూటీ సిఎం పదవి బిజేపి అధిష్టానం ఆఫర్ చేసిందని వార్తల సారాంశం.
ఈసీ నేడు ఢిల్లీలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తుంటే, సరిగ్గా ఇదే సమయంలో కరూర్ తొక్కిసలాట కేసులో విజయ్ నేడు ఢిల్లీలో సీబీఐ విచారణకు హాజరయ్యారు! కనుక సీబీఐ విచారణ పేరుతో విజయ్ని ఢిల్లీకి రప్పించి పొత్తులకు ఒత్తిడి చేస్తుండటం వలననే మీడియాలో ఇలాంటి వార్తలు వస్తున్నయనుకోవచ్చు.
ఇవి ఊహాగానాలా లేదా బిజేపి-టీవీకే పార్టీల మద్య నిజంగానే పొత్తుల చర్చలు సాగుతున్నాయా? అనేది విజయ్ ఢిల్లీ నుంచి చెన్నై తిరిగి వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఒకవేళ బిజేపితో పొత్తుకి విజయ్ నిరాకరిస్తే ఈ సీబీఐ కేసు విచారణ వేగవంతమవుతుంది. ఒకవేళ పొత్తు కుదిరితే కేసు అటకెక్కిపోతుంది. కనుక బిజేపితో విజయ్ తాడో పేడో తేలిపోయే సమయం వచ్చేసినట్లే!




