బలపరీక్షలో నెగ్గారు.. నైతికంగా ఓడిపోయారు!

Vijay Wins Trust Vote Amid Tamil Nadu Political Storm

తమిళనాడు శాసనసభలో సిఎం విజయ్‌ నేడు బల పరీక్షలో భారీ మెజార్టీతో విజయం సాధించారు. టీవీకే పార్టీ, మిత్ర పక్షాలతో కలిపి మొత్తం 119 మంది ఎమ్మెల్యేలు ఉండగా అన్నాడీఎంకేలో తిరుగుబాటు చేసిన 25 మంది ఎమ్మెల్యేలు కూడా మద్దతు పలకడంతో శాసనసభలో టీవీకే పార్టీ 144 మంది మద్దతుతో బలపరీక్షలో నెగ్గింది.

ప్రమాణ స్వీకారం రోజున నీతి నిజాయితీ, నైతిక విలువలంటూ మాట్లాడిన సిఎం విజయ్‌ అప్పుడే అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి తొలిరోజు నుంచే అనైతిక రాజకీయాలు మొదలుపెట్టారని శాసనసభలో డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల సభ్యులు ఆక్షేపింఛి సభ నుంచి వాకవుట్ చేశారు.

ADVERTISEMENT

తర్వాత స్పీకర్‌ ఓటింగ్ నిర్వహించగా టీవీకే పార్టీకి అనుకూలంగా 144, వ్యతిరేకంగా 22 మంది ఎమ్మెల్యేలు ఓట్లు వేశారు. దీంతో విజయ్‌ ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గిందని స్పీకర్‌ ప్రభాకర్ ప్రకటించారు.

విజయ్‌ బలపరీక్షలో నెగ్గారు. వారం రోజుల పాటు ఒక్కో ఎమ్మెల్యే మద్దతు కోసం ముప్పతిప్పలు పడిన విజయ్‌కి ఒకేసారి ఏకంగా 25 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మద్దతు లభించడంతో ఇక ఆయన ప్రభుత్వానికి తిరుగులేదు.

డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు విమర్శించినట్లు విజయ్‌ తొలిరోజు నుంచే అనితిక రాజకీయాలు మొదలుపెట్టేశారు. బంధుప్రీతి, వృధా ఖర్చులకు దూరంగా ఉంటానని చెప్పిన విజయ్‌ తన జ్యోతిష్యుడుని క్యాబినెట్ హోదాతో ఓఎస్‌డీగా నియమించుకోవడంతో మొదటిసారి మాట తప్పారు.

ఎన్నికల ముందు, తర్వాత కూడా అన్నాడీఎంకే-బిజేపిల మద్దతు అవసరమే లేదన్నట్లు వ్యవహరించిన విజయ్‌ అదే అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యేల మద్దతు తీసుకొని తాను కూడా సగటు రాజకీయ నాయకుడినే అని నిరూపించుకున్నారు.

అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తమ పార్టీపై తిరుగుబాటు చేయడానికి విజయ్‌నే నిందించాల్సి ఉంటుంది. అధికారంలోకి వస్తూనే ప్రత్యర్ధి పార్టీని నిలువునా చీల్చిన రికార్డ్ విజయ్‌కే సొంతం. కనుక విజయ్‌ బలపరీక్షలో నెగ్గినా నైతికంగా ఓడిపోయినట్లే. విజయ్‌ ఇక్కడితో ఆగుతారా ఇంకా పతనం చెందుతారా?

ADVERTISEMENT
Latest Stories