వైఎస్సాఆర్ కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తెలివిగా మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది. ఎపిలో తెరాస పోటీ చేయదని, అలాగే ఎవరికి మద్దతు ఇవ్వదని అని ఆయన చెప్పుకొచ్చారు. అక్కడి వరకు బానే ఉంది వెంటనే ఫెడరల్ ప్రంట్ లోని భాగస్వాములకు మద్దతుగా ప్రంట్ ప్రచారం చేస్తుందని ఆయన అన్నారు. అంటే తెరాస పోటీ చెయ్యదు గానీ ఫెడరల్ ఫ్రంట్ ముసుగులో వైకాపాకు ప్రచారం చేస్తారు కేసీఆర్ అనే గా ఆయన చెప్పింది. కాకపోతే కాస్త గమ్మత్తుగా చెప్పుకొచ్చారు.
రాష్ట్రాల హక్కు కోసం కేంద్రంతో పోరాడాటానికి ఒక వేదికగా ఫెడరల్ ఫ్రంట్ నిలుస్తుందని, ఇది ఒక్క తెరాస,వైకాపాది మాత్రమే కాదన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీలు ఇందులో భాగమవుతాయన్నారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చేవారికే తమ పార్టీ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. దీనితో వైకాపా ఫెడరల్ ఫ్రంట్ లో చేరడం అనేది లాంఛనమే అని ఆయన మాటలలో స్పష్టం అవుతుంది. కాకపోతే అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది.
కేటీఆర్ వచ్చి అడిగినప్పుడు కాకుండా కేసీఆర్ వచ్చి అడిగితేనే ప్రకటన చెయ్యాలని భావించి జగన్ ఆ నిర్ణయం వాయిదా వేశారని సమాచారం. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనకు బయలుదేరిన జగన్ 22న తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఆయన వచ్చాకా తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ కు వచ్చి డైరెక్టుగా చర్చలు జరిగే అవకాశం ఉంది. విజయవాడలో గానీ కడపలో గానీ ఈ మీటింగు జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. కేసీఆర్ జగన్ లిద్దరికీ అనుకూలమైన సమయాన్ని బట్టి తేదీ ఫైనల్ అవుతుందని ఇరు వర్గాల వారు చెబుతున్నారు.




