విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు బుడమేరు సృష్టించిన విలయానికి గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా పరిహారం ప్రకటించింది. దీనితో తమకు జరిగిన నష్టంలో కొంతైన ప్రభుత్వం తిరిగి చెల్లిస్తున్నందుకు కాస్త ఊరట చెందిన బాధితులు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు.
తమకు ప్రభుత్వం చెల్లిస్తానన్న పరిహారం రాలేదంటూ కొందరు బాధితులు విజయవాడ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. అధికారులు విడుదల చేసిన ఎన్యుమరేషన్ జాబితాలో తమ పేరు లేదంటూ ఆందోళనకు దిగారు బాధితులు. ఈ లిస్టులో తమ పేరు లేనందున తమకు నష్ట పరిహారం ఇవ్వడం కుదరదు అంటూ అధికారులు వాపోతున్నారంటూ నిరసనకు దిగారు బాధితులు.
అలాగే తమ పేర్లు కూడా ఆ లిస్టులో జత చెయ్యాలంటూ అధికారులను నిలదీస్తున్నారు. దీనితో విజయవాడ కలెక్టర్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బాధితులకు మద్దతుగా వారికీ న్యాయం చెయ్యాలంటూ కమ్యూనిస్టు పార్టీల నేతలు కూడా కలెక్టర్ కార్యాలయం వద్ద బాధితులతో కలిసి ఆందోళనకు దిగారు.
అయితే పరిస్థితిలు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కలెక్టర్ కార్యాలయం గేట్లు మూసివేయడంతో బాధితులు గేట్లను తోసుకుంటూ కలెక్టర్ కార్యాలయం లోకి దూసుకు వస్తున్నారు. అయితే వరద బాధితుల నష్ట పరిహారానికి ఏపీ ప్రభుత్వం దాదాపు 600 కోట్లు విడుదల చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇందులో తప్పఎక్కడ జరిగింది వెంటనే నిగ్గ్గు తేల్చి అధికారులు, ప్రభుత్వం బాధితులకు అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సీఎం చంద్రబాబు బాధితులలో చివరి కుటుంబానికి కూడా న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం అంటూ ప్రకటన చేసినప్పటికీ ఇంకా బాధితులు తమకు అన్యాయం జరుగుతుంది అంటూ నిలదీస్తున్నారు అంటే అధికారుల మధ్య సమన్వయ లోపమా.?
లేక బాధితులకు అందించే పరిహారం విషయంలో కూడా అధికారులు చేతి వాటం ప్రదర్శిస్తున్నారా.? లేక నిరశన తెలియ చేసే వారు అసలైన బాధితులేనా.? అనేది ప్రభుత్వం తేల్చాల్సి ఉంటుంది. అలాగే ఆందోళన చేసే వారు నిజమైన బాధితులే అయినట్లయితే వారి సమస్యను తక్షణమే సరిచేసి వారికి కూడా తగిన న్యాయం చెయ్యవలసిన బాధ్యత ప్రభుత్వానిదే అవుతుంది.




