విజయవాడలో వరదలు సృష్టించిన బీభత్సం నుండి ప్రజలు బయటకొస్తున్నారు. అలాగే ఏపీ ప్రభుత్వం కూడా వరద బాధితుల పరిహారం కోసం ఒక ప్రత్యేక ప్యాకేజ్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే నేడు విజయవాడ కలెక్టర్ కార్యాలయం నుండి ఈ పరిహారం నేరుగా బాధితుల వ్యక్తిగత ఖాతాలో జమ చేయనున్నట్లు అధికారులు తెలియచేసారు.
అయితే ఇందుకు సంబంధించిన అన్ని సర్వేలు ఇప్పటీకే ఆయా అధికారులు బాధితుల నుండి సేకరించి కలెక్టెర్ కార్యాలయానికి అందించడం జరిగింది. దీనితో పరిహారం విషయంలో ప్రభుత్వం పారదర్శకతతో వ్యవహరించాలని ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా ప్రభుత్వం అందించే మొత్తం పరిహారాన్ని బాధితులకు అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
దానితో పాటుగా ఆ వరదల సమయంలో ఎంతోమంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కట్టుబట్టలతో ఇళ్ల నుండి బయటకు రావడం జరిగింది. ఇటు వంటి సందర్భంలో బాధిత కుటుంబసభ్యుల ఒరిజినల్ సర్టిఫికెట్లు, డాక్యుమెంట్స్, ఆధార్, పాన్, మార్క్స్ లిస్ట్…ఇలా ఎన్నో ప్రభుత్వం జారీ చేసిన విలువైన సర్టిఫికెట్లు వరదలపాలయ్యాయి. అయితే ఈ విషయంలో కూడా వరద బాధితులకు ప్రభుత్వం అండగా నిలిచింది.
వరదల సమయంలో ఒరిజినల్ సర్టిఫికెట్లు కోల్పోయిన వారికీ ప్రభుత్వమే ఉచితంగా డూప్లికేట్ సర్టిఫికెట్లు, డాక్యుమెంట్స్, సర్టిఫైడ్ కాపీలు అందచేస్తుందని ప్రభుత్వం బాధితులకు భరోసా కల్పించింది. అందుకు తగ్గట్టే రాష్ట్ర ప్రభుత్వం ఆయా శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. వరద ప్రభావిత ప్రాంతాలలోని ప్రజలు తమ సర్టిఫికెట్లు తిరిగి పొందడానికి ఆయా శాఖల అధికారులను సంప్రదించాలని తెలియచేస్తుంది.
వాహన రిజిస్టేషన్ సరిఫికేట్స్, రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్, ఆధార్, బర్త్, డెత్, మ్యారేజ్ ఇలా ఎటువంటి సర్టిఫికెట్లు కోల్పోయినా, పాడైపోయిన సదరు బాధితులకు వెంటనే డుప్లికేట్ సర్టిఫికెట్లు ఉచితంగా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి బాధిత ప్రాంతాలలో అధికారులు స్పెషల్ డ్రైవ్ లు చేపట్టి ప్రజలను చైతన్య పరిచి ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని వినియోగించుకునేలా చూడాలంటూ స్పష్టం చేసింది.
కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో వరద బాధితులకు మరో ఉపశమనం దొరికినట్లయింది. ఒక పక్క వరద బాధితులకు పరిహారం కింద ప్యాకేజ్, మరోపక్క సరిఫికేట్స్ కోల్పోయిన వారికీ కొత్త డుప్లికేట్ సర్టిఫికెట్లు ఇష్యూ చేయడం, అలాగే వరదలలో పాడైపోయిన వాహనాలకు కూడా ఇన్సూరెన్స్ అందేలా ఆయా కంపెనీలతో చర్చలు జరిపి బాధితులకు సాయం అందేలా చూడడం ఇలా కూటమి ప్రభుత్వం తన శక్తి వంచన లేకుండా బాధితులకు ప్రభుత్వం నుండి చేయగలిగినదంతా చేస్తున్నారు.




