151 సీట్లతో అందలం ఎక్కిన వైసీపీ ని 11 కి పడేసి 164 సీట్లతో కూటమి ప్రభుత్వానికి కనీసం ప్రతిపక్షం కూడా లేకుండా అంతులేని అధికారాన్ని కట్టపెట్టారు ఏపీ ప్రజానీకం. అయితే దీనికి వైసీపీ మీద ఉన్న వ్యతిరేకతతో పాటుగా ఎన్నో అంతుచిక్కని ప్రశ్నలకు ఈ ప్రభుత్వం సమాధానం చెపుతుంది అనే నమ్మకంతో ఇంతటి అధికారాన్ని కూటమి పార్టీలకు అందించారు.
అయితే ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుని ఆ వైసీపీ గండికోట రహస్యాలను భయటపెట్టాల్సిన బాధ్యత ముఖ్యంగా టీడీపీ, జనసేన రెండు పార్టీల మీద ఉన్నాయి.అయితే ఆ దిశగా కూటమి ప్రభుత్వం ఇంతవరకు అడుగు ముందుకు వేసిందా అంటే ఆ పార్టీ నేతల నుండి సమాధానం లేదు.
ముందుగా హూ కిల్డ్ బాబాయ్ అంటూ చంద్రబాబు, తన సొంత బాబాయ్ నే చంపినవాడు అంటూ పవన్ ఎన్నికల ప్రచారంలో మాజీ ముఖ్యమంత్రి మీద తీవ్ర విమర్శలు చేసారు. అలాగే ఈ విషయంలో జగన్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించిన జగన్ సోదరీమణులు షర్మిల, సునీత కు కూడా బాబు, పవన్ లు మద్దతుగా నిలిచారు.
అయితే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వీరిద్దరూ ఈ కేసు విషయంలో జగన్ కు కేవలం కౌంటర్లు మాత్రమే ఇవ్వగలిగారు. కానీ ఇప్పుడు ఒకరు రాష్ట్ర ముఖ్యమంత్రి, మరొకరు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కావడంతో ఇప్పుడు కౌంటర్లు కాదు క్లారిటీ కావాలంటున్నారు ప్రజలు. ‘వివేకా దారుణ హత్య’ వెనుక దాగి ఉన్న రాజకీయం ఎవరిదీ అనేది తేల్చి ఐదేళ్ల సునీత న్యాయ పోరాటానికి ఒక ముగింపు పలకాలి.
అలాగే మైనర్ బాలిక సుగాలి ప్రీతి హత్యాచారం కేసు విషయంలో కూడా పవన్ గత వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. అలాగే తనకు అధికారం ఉండి ఉంటె తక్షణమే ఈ కేసు విచారనకు తగిన ఆదేశాలు ఇచ్చి బాధిత కుటుంబానికి న్యాయం చేయగలిగే వాడిని అంటూ వ్యాఖ్యానించారు పవన్.
ఇప్పుడు పవన్ కు కావాల్సిన అధికారం చేతికి వచ్చింది. అలాగే సుగాలి ప్రీతి కుటుంబానికి అందాల్సిన న్యాయం కూడా వారికీ జరిగితీరాలి. ఇక జగన్ కోడికత్తి కేసులో నిందితుడిగా సుమారు 5ఏళ్ళ పాటు శిక్ష అనుభవించిన శ్రీను అంతర్మధనాన్ని బయటపెట్టాలి. అసలు ఆ కేసు వెనుక దాగి ఉన్న అసలు వాస్తవాలు ప్రజలకు తెలవాలి.
వైసీపీ ప్రభుత్వహయాంలో ఆపార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు తన కార్ డ్రైవర్ ‘సుబ్రహ్మణ్యం’ను హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేసి దర్జాగా రోడ్ల మీద తిరుగు తన వికృత చేష్టలతో సోషల్ మీడియాలో దొరుకుతున్నాడు. గత ప్రభుత్వంలో న్యాయం దొరకని ఆ సుబ్రహ్మణ్యం కుటుంబానికి కూటమి ప్రభుత్వంలో న్యాయం జరిగేలా చూడాలి.
ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టుగా జగన్ ‘గులకరాయి’ దాడి వెనుక దాగి ఉన్నది చిదంబర రహస్యం మా.? లేక జగన్నాటకమా.? అనేది తేల్చాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీదే ఉంది. వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా జగన్ విప్పలేని ఈ చిక్కుముడులను జాగ్రత్తగా విప్పి ప్రజల ముందు పరచలసిన ఆవశ్యతకత కూటమి ప్రభుత్వానిదే.
ఇన్నాళ్ళుగా బాబు, పవన్ లకు జగన్ ను కౌంటర్ చేయడానికి ఉపయోగపడిన ఈ కేసులన్నిటికి కూటమి ప్రభుత్వం క్లారిటీ ఇస్తే ప్రజలలో ప్రభుత్వం పట్ల, నాయకుల పట్ల, నాయకత్వం పట్ల ఉన్న నమ్మకం రెట్టింపు అవుతుంది.




