విజయవాడ వరదలతో ప్రజలు తీవ్రంగా నష్టపోయి, అనేక ఇబ్బందులు పడుతున్నారని కనుక వారు ఆవేశంతో కోపగించుకుంటే, అధికారులు, సిబ్బంది వారి మాటలని పట్టించుకోకుండా వారికి సహాయం చేయాలని సిఎం చంద్రబాబు నాయుడు పదేపదే చెప్పారు. అయినప్పటికీ కొంతమంది అధికారులు, సిబ్బంది సహనం కోల్పోయి తమని నిలదీస్తున్న ప్రజలతో వాగ్వాదాలకు దిగుతున్నారు.
విజయవాడలో వరద బాధితులకు ప్రభుత్వం నిత్యావసర సరుకులు, బియ్యం, మంచినీళ్ళ బాటిల్స్ వగైరా పంపిణీ చేయిస్తున్న సంగతి తెలిసిందే.
విజయవాడలో ఓ కాలనీలో వరద బాధితులకు అవి అందకపోవడంతో వీఆర్వో జయలక్ష్మిని నిలదీశారు. ప్రభుత్వం మారినా ఆమె తీరు మారలేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో ఆమె వారితో వాగ్వాదానికి దిగి సహనం కోల్పోయి పోలీసుల ఎదుటే వరద బాధితుడి చెంప చెళ్ళుమనిపించింది.
ఈ ఘటన సిఎం చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్ళడంతో ఆమెపై చర్యలు తీసుకోవలసిందిగా జిల్లా కలెక్టర్ సృజనని ఆదేశించారు. ఆమె వెంటనే వీయార్వో జయలక్ష్మీని ఉద్యోగంలో నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
గత ప్రభుత్వంలో సిఎం జగన్, వైసీపి మంత్రులు, ఎమ్మెల్యేల తీరు వలన ప్రభుత్వానికి, వైసీపికి చెడ్డ పేరు వచ్చింది. తీరని అప్రదిష్టమూటగట్టుకుని ఎన్నికలలో ఘోరపరాజయం పొందారు. ఇప్పుడు సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు, అధికారులు వరద బాధితులను ఆడుకునేందుకు ఎంతగానో శ్రమిస్తూ మంచిపేరు తెచ్చుకుంటుంటే, ఇటువంటి కొంతమంది అధికారుల వలన ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది. కనుక ప్రజలపై చెయ్యి చేసుకున్న అటువంటి అధికారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం చాలా అవ్సరమే.




