హమ్మయ్య కృష్ణమ్మా శాంతించింది. బుడమేరు మహోగ్రరూపం చాలించింది అంటూ అటు ప్రభుత్వ యంత్రాంగం, ఇటు వరద ప్రభావిత ప్రాంత ప్రజలు ఉపిరిపీల్చుకుంటున్న తరుణంలో బుడమేరు సింగినగర్ పై మరోసారి తన ప్రకోపాన్ని చూపించింది. ఇప్పుడిప్పుడే పునరావాస కేంద్రాల నుండి ఇళ్లకు చేరుకుంటున్న సింగినగర్ ప్రజలకు మరోసారి వరద భయం వెంటాడుతుంది.
విజవాడలోని బుడమేరు వాగుకు మూడు ప్రాంతాలలో గండ్లు పడగా లోకేష్, నిమ్మల రామానాయుడు నేతృత్వంలో రెండు గండ్లను అధికారులు పూడ్చేసారు. ఇక శాంతి నగర్ సమీపంలో ఉన్న మూడో గండిని పూడ్చడం అత్యంత కష్టతరం కావడంతో కేంద్రం ఆర్మీ ని రంగంలోకి దింపింది.
“ఆపరేషన్ బుడమేరు” పేరుతో యుద్ధ ప్రతిపాదికన ఆర్మీ సిబ్బందితో కలిసి రాష్ట్ర విపత్తు వ్యవస్థ, జలవనరుల శాఖ మంత్రి గండి పూడ్చే ప్రయత్నాలను ముమ్మరం చేసారు. అయితే పైన కురుస్తున్న వర్షాల కారణంగా బుడమేరు ప్రవాహ ఉదృతి అంచలంచలుగా పెరుగుతూ మళ్ళీ సింగినగర్ ప్రాంతాన్ని చుట్టుముట్టింది.
నిన్నటితో పోలిస్తే సింగినగర్ ప్రాంతంలో వరద తీవ్రత మరో మూడడుగులు పెరిగినట్లు స్థానికులు వాపోతున్నారు. దీనితో మరోసారి బుడమేరు తమ ప్రాంతాన్ని ముంచేస్తుంది అనే భయాందోళనలోకి అక్కడి ప్రాంత ప్రజలు ఇళ్లను వదిలి బయటకు పరుగులు తీస్తున్నారు.
అధికారులు కూడా ప్రజలను అప్రమత్తం చేస్తూ లోతట్టు ప్రాంతాల ప్రజలను తిరిగి పునరావాస ప్రాంతాలకు తరలించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇటు ఒక పక్క సహాయక చర్యలను చేపడుతూనే మరో పక్క ప్రజలను అప్రమత్తం చేస్తూ అధికారులు నిత్యం ఎలర్ట్ గా ఉంటున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ బుడమేరు ప్రవాహ వేగాన్ని సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు అధికారులకు తగిన సూచనలు ఇస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు.




