అదేంటి… జగన్‌ తన అరాచకపాలన గురించి చెప్పుకుంటున్నారు?

what-is-jagan-saying-about-his-anarchy

అదేమీ విచిత్రమో కానీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను పాలించిన వైసీపి, బిఆర్ఎస్ పార్టీల నేతలు ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు తమని తాము నిందించుకుంటున్నట్లే ఉన్నాయి. ఇప్పుడు వారు మాట్లాడుతున్నవన్నీ గతంలో వారు అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు, చేసిన తప్పులు, జరిగిన పొరపాట్లు, మాట్లాడిన మాటలనే గుర్తు చేసుకుంటున్నట్లున్నాయి.

ADVERTISEMENT

తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్ళు పాలించిన కేసీఆర్‌, రాష్ట్రంలో ప్రతిపక్షాలను నిర్వీర్యం చేశారు. ఏనాడూ వాటిని పరిగణనలోకి తీసుకోలేదు. ఆనాడు బిఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయించిన తమ ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేయాలని కాంగ్రెస్‌, టిడిపిలు కోరితే వెకిలి నవ్వులు నవ్వుతూ వాటిని ఈసడించుకునేవారు.

ఇప్పుడు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం కూడా అదే చేస్తుంటే ‘అన్యాయం, అక్రమం, అనైతికం’ అంటూ కేటీఆర్‌ గగ్గోలు పెడుతున్నారు. స్పీకర్‌ తీరుని తప్పు పడుతున్నారు. గవర్నర్‌ని కలిసి ఫిర్యాదు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు వరకు వెళ్ళి పోరాడుతామని హెచ్చరిస్తున్నారు.

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఖూనీ అయిపోతున్నాయని వాపోతున్నారు. కేటీఆర్‌ మాటలు వింటుంటే ఆనాడు కేసీఆర్‌ ప్రభుత్వం వ్యవహరించిన తీరే గుర్తుకు వస్తుంది.

ఇక నేడు ఢిల్లీలో ధర్నా చేస్తున్న జగన్‌ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ మాట్లాడుతున్న మాటలు తన పాలనలో జరిగిన అరాచకాలనే ఎక్కువ గుర్తు చేస్తున్నాయి.

రాష్ట్రంలో ఎక్కడ చూసినా రాజకీయ హత్యలు, వైసీపి కార్యకర్తలు, సానుభూతిపరులపై భౌతికదాడులు, పార్టీ కార్యాలయాలపై దాడులు, విధ్వంసం జరుగుతోందన్నారు.

ఇంతగా దాడులు, విధ్వంసం జరుగుతున్నా పోలీసులు చేతులు ముడుచుకొని చూస్తున్నారే తప్ప దాడులకు తెగబడుతున్నవారిపై ఎటువంటి చర్యలు చేపట్టడం లేదన్నారు. పైగా ఈ దౌర్జన్యాలను ప్రశ్నించినందుకు పోలీసులు తమపైనే కేసులు నమోదు చేస్తున్నారని జగన్‌ ఆరోపించారు. రాష్ట్రంలో రాక్షసపాలన సాగుతోందని, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోతున్నాయని జగన్‌ ఆరోపించారు.

జగన్‌ చెపుతున్న ఈ మాటలన్నీ గత 5 ఏళ్ళలో తన పాలనలో జరిగిన అరాచకాల గురించి స్వయంగా చెప్పుకుంటున్నట్లే ఉందనిపిస్తోంది కదా?జగన్, కేటీఆర్‌ ఇద్దరూ ఎదుటవారిని నిందించబోయి తమను తామే నిందించుకుంటున్నట్లు ఉంది కదా?

ADVERTISEMENT
Latest Stories