ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో వైసీపి, బిఆర్ఎస్ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడూ, లేనప్పుడూ వాటి పరిస్థితి ఇంచుమించు ఒకేలా ఉండటం విశేషం.
అధికారంలో ఉన్నప్పుడు రెండు పార్టీల అధినేతలు తమకు ఎదురేలేదు… తామంత గొప్ప నాయకుడు, రాజకీయ మేధావి మరొకరు లేరన్నట్లు అతిశయం ప్రదర్శించేవారు. కానీ ఇద్దరూ ఎన్నికలలో ఓడిపోయారు.
ఆ షాక్ నుంచి జగన్ త్వరగానే కోలుకున్నారు కానీ కేసీఆర్ ఇంకా కోలుకున్నట్లు లేదు. అందుకే ఫామ్హౌస్ నుంచి బయటకు రావడం లేదు. అంతా కొడుకు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావుల చేతే నడిపిస్తున్నారు. ఇంకా ఎప్పుడు బయటకు వస్తారో వారిరువురూ కూడా చెప్పలేకపోతున్నారు.
జగన్ ఓటమి షాక్ నుంచి కోలుకున్నప్పటికీ ఆయన కూడా తాడేపల్లి ప్యాలస్లో నుంచి బయటకు రావడం లేదు. ఇదివరకు బటన్ నొక్కుడు సభలకు బయటకు వచ్చిపోయిన్నట్లే, ఇప్పుడూ ఏదైనా పెద్ద సంఘటన జరిగితేనే బయటకు వచ్చిపోతున్నారు.
కానీ బయటకు రాకపోయినా నియోజకవర్గాలవారీగా పార్టీ నేతలను ప్యాలస్కి పిలిపించుకొని మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామని అంతవరకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ధైర్యంగా ఉండాలని అందరికీ నచ్చజెప్పి పంపిస్తున్నారు.
కేసీఆర్ ఈ బాధ్యతని కేటీఆర్, హరీష్ రావులకు అప్పగించేసి నిశ్చింతగా ఫామ్హౌస్లో కాలక్షేపం చేస్తున్నారు. ఆయన తరపున వారిరువురూ రాజకీయాలలో చురుకుగా పాల్గొంటూ బిఆర్ఎస్ పార్టీ ఎప్పటిలాగే బలంగా ఉందని ప్రజలు భావించేలా చేయగలుగుతున్నారు.
కానీ జగన్ తరపున ఈవిదంగా రాజకీయాలలో చురుకుగా పాల్గొనేందుకు ఆయన కుటుంబంలో ఎవరూ లేరు. పార్టీలో చాలా మంది సీనియర్లున్నా జగన్ తరపున ఓవర్ యాక్షన్ చేస్తే ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని మొక్కుబడిగా వ్యవహరిస్తున్నారు.
తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ చురుకుగా ఉండేందుకు, మళ్ళీ బలపడేందుకు అవకాశాలు బాగానే లభిస్తున్నాయి.
కానీ ఏపీలో వైసీపికి ఇంతవరకు అటువంటి అవకాశాలు లభించలేదనే చెప్పాలి. విజయవాడ వరదలు, తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారాలలో జగన్ చేసిన ఓవర్ యాక్షన్ బెడిసి కొట్టింది. కనుక మరో గొప్ప అవకాశం కోసం ఇక్కడ జగన్, అక్కడ కేసీఆర్ ఓపికగా ఎదురుచూస్తున్నట్లున్నారు. వారికి ఆ గొప్ప అవకాశం ఎప్పుడు లభిస్తుందో ఎప్పుడు బయటకు వస్తారో?




