హూ కిల్డ్ బాబాయ్?

Who Killed YS Vivekananda Reddy,? Unanswered Questions

2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య చేయబడ్డారు. అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కనుక ఆయనే ఈ హత్య చేయించారని జగన్‌ అండ్ కో వాదించింది.

ADVERTISEMENT

ఒకవేళ అది నిజమే అనుకుంటే, వివేకా హత్యకు గురైతే గుండెపోటు అని జగన్‌, విజయసాయి, అవినాష్ రెడ్డి తదితరులు ఎందుకు అబద్దం చెప్పారు? అటువంటి నేరం జరిగినప్పుడు సాక్ష్యాధారాలు చాలా ముఖ్యం. కనుక వాటిని ఎవరూ తొలగించకూడదు కనీసం ముట్టుకోకూడదు. కానీ వివేకా ఇంట్లో రక్తం మరకలు ఎందుకు తుడిచారు?

మృతదేహాన్ని హాస్పిటల్‌కు తీసుకువెళ్ళి బ్యాండేజీలు ఎందుకు చుట్టించారు?శవపరీక్ష చేయకుండా హడావుడిగా అంత్యక్రియలు చేయాలని ఎందుకు ప్రయత్నించారు?ఆయన హత్య చేయబడుతున్నప్పుడు ఓ లేఖ వ్రాశారనే విషయం వైసీపీ నేతలకు ఎలా తెలుసు?

వివేకా హత్యని ఎన్నికలలో ఎవరూ ఉపయోగించుకుని లబ్ధి పొందారు?అనే సామాన్యమైన ప్రశ్నలే చాలు వైసీపీ నేతల ప్రమేయం ఉందని చెప్పడానికి. కనుక పోలీసులు, సిట్, సీబీఐ దర్యాప్తులో ఇంతకంటే చాలా కీలకమైన విషయాలే కనుగొనగలరని వేరే చెప్పక్కరలేదు.

ఒకవేళ వివేకా హత్య కేసులో చంద్రబాబు నాయుడు ప్రమేయం ఉందని జగన్‌ భావిస్తే ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ళలో నేర విచారణని వేగవంతం చేసి ఆయనని దోషిగా నిరూపించి శిక్ష పడేలా చేయొచ్చు కదా? కానీ 5 ఏళ్ళు ఏం చేశారంటే సీబీఐ విచారణ జరుపకుండా అడుగడుగునా అడ్డుకున్నారు కదా?

తాను ఎంతగానో ద్వేషిస్తున్న చంద్రబాబు నాయుడుని ఈ కేసులో జైలుకి పంపించి టీడీపీని భూస్థాపితం చేయగల గొప్ప అవకాశం జగన్‌కు లభించినప్పుడు ఈ కేసు అంటే విచారణ జరుగకూడదని ఎందుకు కోరుకున్నారు? ఎందుకు అడ్డుకున్నారు? అని ఆలోచించినా సమాధానం లభిస్తుంది కదా?

ఇంతకీ విషయం ఏమిటంటే, ఈ కేసులో ఏ-2గా ఉన్న సునీల్ యాదవ్ తన ప్రాణానికి ప్రమాదం పొంచి ఉందని పోలీసులకు పిర్యాదు చేయడంతో వైసీపీ నేతలు, ఈ కేసులో నిందితుడుగా వైఎస్ వివేకా పీఏ కృష్ణారెడ్డి తదితరులు ఎల్లో మీడియా కుట్ర అంటూ ప్రెస్‌మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు.

సిఎం చంద్రబాబు నాయుడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి ఓ పధకం ప్రకారం తమ గురించి, జగన్‌ గురించి తప్పుడు వార్తలు వ్రాస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నాయని ఆరోపించారు.

కృష్ణారెడ్డి తమ సొంత మీడియాతో మాట్లాడుతూ, “ఈ కేసు సీబీఐ విచారణాధికారి రాంసింగ్ తనని అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శంకర్ పేర్లు చెప్పాలని ఒత్తిడి చేస్తూ కొట్టారు. ఇదే విషయం నేను పోలీసులకు పిర్యాదు చేస్తే పట్టించుకోలేదు.

ఈ కేసులో నేను విచారణ కోసం హైదరాబాద్‌, ఢిల్లీ వెళ్ళాల్సివస్తుందని చెప్పేవారు. అంటే వారికి అన్ని విషయాలు ముందే తెలుసన్న మాట. వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి కూడా నన్ను బెదిరించారు,” అని కృష్ణారెడ్డి ఆరోపించారు.

అయితే అప్పుడు జగనే ముఖ్యమంత్రిగా ఉన్నారని, తమ చెప్పు చేతలలోనే యావత్ పోలీస్ యంత్రాంగం ఉందనే విషయం కృష్ణారెడ్డి బహుశః మరిచిపోయిన్నట్లున్నారు. జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలీసులు తనని పట్టించుకోలేదని కృష్ణారెడ్డి చెపితే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది కదా?

నాటి నుంచి నేటి వరకు ఈ హత్య కేసుని చంద్రబాబు నాయుడు మెడలో వేయాలని వైసీపీ నేతలు ప్రయత్నిస్తూనే ఉన్నారు కదా?అది వ్యక్తిత్వ హననం కాదా? ఎవరూ వెయ్యేళ్ళు జీవించలేరు 90-100 ఏళ్ళు మాత్రమే బ్రతికి ఉంటారని, కనుక హాయిగా జీవించకుండా ఈ హత్యారాజకీయాలు ఎందుకని కృష్ణారెడ్డి ప్రశ్నించడం కొసమెరుపు!

ADVERTISEMENT
Latest Stories