ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి సంక్రాంతి వేడుకలని ప్రభుత్వమే అట్టహాసంగా నిర్వహిస్తోంది. మామూలుగానే సంక్రాంతి పండుగ సందడి చాలా ఉంటుంది. ఇక ప్రభుత్వం కూడా ఓ చెయ్యేసి ప్రోత్సహిస్తే ఇక చెప్పక్కర లేదు. సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, కూటమి ఎమ్మెల్యేలు, నేతలు వారివారి నియోజకవర్గాలలో ఈ వేడుకలు నిర్వహించి పాల్గొంటున్నారు.
సిఎం చంద్రబాబు నాయుడు తన నియోజకవర్గంలో ప్రజలతో కలిసి సంక్రాంతి వేడుకలు జరుపుకునేందుకు సకుటుంబ సమేతంగా కుప్పం చేరుకున్నారు. డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ మొన్న పిఠాపురంలో వేడుకలలో పాల్గొన్నారు.
కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తదితరులు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో ఈత పోటీ నిర్వహించారు. ఈ వేడుకలని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాదిగా జనం తరలి వచ్చారు.
జగన్ హయంలో ఐదేళ్ళపాటు తెలుగువారి సాంస్కృతిక విధ్వంసం జరిగింది. దానిలో భాగంగానే తెలుగు భాషని దెబ్బ తీయడానికి ఇంగ్లీష్ మీడియం తెచ్చారు. పండుగల సమయంలో రకరకాల ఆంక్షలు విదిస్తుండేవారు. వినాయకచవితికి విగ్రహాలు అమ్మరాదని, నిమజన్నాలు చేయరాదని పోలీసులతో అడ్డుకునేవారు. తిరుమలతో సహా రాష్ట్రంలో ప్రసిద్ద ఆలయాలలో జరిగిన అపచారాలకు, మత మార్పిడులకు లెక్కే లేదు.
కనుక మళ్ళీ మన తెలుగు భాష, ఆలయాల ప్రతిష్ట, సంస్కృతీ సంప్రదాయాల పునరుజ్జీవనం తప్పనిసరి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావించి దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. వాటిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ సంక్రాంతి వేడుకలు!
కానీ ఒకే ఒక్క లోటు కొట్టవచ్చినట్లు కనిపిస్తోంది… సత్తెనపల్లిలో మన రాంబాబుగారి ఆట పాట! అటువంటి కళాకారుడిని ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా బాధాకరం. కనుక అయనే కాస్త పెద్ద మనసు చేసుకొని ఈ పండగకు డాన్స్ చేసి ప్రజలను అలరిస్తారని ఆశిద్దాం.







