ఎవరు అవునన్నా కాదన్నా, ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా తెలంగాణ రాజకీయాలలో కల్వకుంట్ల కుటుంబం ఒక ప్రముఖ పాత్ర పోషిస్తుందనేది నమ్మదగ్గ యదార్ధం. అయితే బిఆర్ఎస్ ఓటమితో, కల్వకుంట్ల ఇంటి రాజకీయం రచ్చకెక్కి ఇటు బిఆర్ఎస్ పార్టీని ఇరుకున పెడుతుంది, అటు ప్రత్యర్థి పార్టీల రాజకీయ ఇబ్బందులను తొలగిస్తుంది.
ఇన్నాళ్లు పార్టీలో ఒక్కటిగా ఉన్న కల్వకుంట్ల కుటుంబం ఇప్పుడు రెండుగా ఛీలడానికి, ఒకరి పై ఒకరు విమర్శనాబాణాలు ఎక్కుపెట్టుకునే స్థాయికి చేరడానికి అసలు కారణాలు ఏమిటి అనే సందేహం రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలలో చర్చనీయాంశమే.
అయితే 2023 తెలంగాణ ఎన్నికలకు ముందు కేసీఆర్ కుమార్తె, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొని, విచారణలకు హాజరయ్యి చివరికి అరెస్టయ్యి తీహార్ జైలుకెళ్లారు. ఎన్నికలకు ముందు కవిత పై ఇలా భారీ స్థాయిలో అవినీతి ఆరోపణలు రావడం,
అందునా లిక్కర్ వంటి ప్రజామద్దతు దక్కని కేసులో కవిత అరెస్టవ్వడం దాని ప్రభావం బిఆర్ఎస్ ఎన్నికల ఫలితాల పై పడింది అనే భావన బిఆర్ఎస్ శ్రేణులలో బలంగా పాతుకుపోయింది. అయితే ఇదంతా బీజేపీ కక్ష్య సాధింపు చర్యలతో భాగమే అంటూ బిఆర్ఎస్ అధినాయకత్వం ఓటర్లకు నచ్చచెప్పాలని చూసినా ఆ చర్యలు ఫలితాన్ని ఇవ్వలేదు.
అయితే కవిత అరెస్టే బిఆర్ఎస్ ఓటమిని నిర్దేశించిందా అంటే ఖచ్చితంగా కాదు అనే చెప్పాలి. కానీ బిఆర్ఎస్ ఓటమిలో కవిత లిక్కర్ కేసు కూడా ఒక కీలక పాత్ర పోషించింది. అయితే ఇక్కడ మొదలైన కల్వకుంట్ల ఇంటి రాజకీయం పెరిగి పెరిగి చివరికి కవిత పార్టీ నుండి సస్పెన్షన్ వేటుతో బయటకు వచ్చే వరకు వెళ్ళింది.
అయితే బిఆర్ఎస్ vs కవిత గా సాగుతున్న ఈ రాజకీయ చదరంగానికి భీజం ఇక్కడే పడిందా అంటే అంతకు ముందే అనిచెప్పొచ్చు. బిఆర్ఎస్ గత పదేళ్లుగా అధికారంలోనే ఉంది, పార్టీ అధినేతగా కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్, పార్టీ కీలక నేతగా హరీష్ ముగ్గురు బిఆర్ఎస్ లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు.
కానీ కేసీఆర్ కుమార్తెగా కవితకు బిఆర్ఎస్ లో, రాష్ట్ర రాజకీయాలలో అంత కీలక పాత్ర దక్కిందా అంటే లేదనే చెప్పాలి. బిఆర్ఎస్ మొదటి నుంచి కవితను రాష్ట్ర రాజకీయాలకు దూరంగానే ఉంచింది, అలాగే నిజామాబాద్ ఎంపీగా ఢిల్లీ కేంద్రంగా కవిత ను పార్లమెంట్ కి పంపింది.
2018 ఎన్నికలలో అనూహ్యంగా కవిత ఓడిపోయారు, కేసీఆర్ కుమార్తెగా, కేటీఆర్ సోదరిగా ఉండి కూడా కవిత ఓడిపోవడం అనేక అనుమానాలకు తెరలేపింది. అందునా ఆ ఎన్నికలలో బిఆర్ఎస్ తన హవ కొనసాగించింది. అయితే కవిత ఓడిపోవడం అంటే అందుకు సొంత పార్టీ నేతలే కారణం అనే ప్రచారం అప్పట్లో గట్టిగానే నడిచింది.
అలాగే ఆ సమయంలో కవిత రాష్ట్ర రాజకీయాల వైపు మొగ్గుచూపినా అందుకు కేసీఆర్ నుంచి కేటీఆర్ వరకు ఎవరు కూడా తన ప్రతిపాదనను పట్టించుకోలేదని, ఇక చేసేదేమి లేక ఎమ్మెల్సీ తో కవితకు సర్దిచెప్పి పక్కన పెట్టారు అనే వాదన కూడా ప్రచారంలో ఉంది.
ఇక అక్కడ మొదలైన ఈ కల్వకుంట్ల సిరీస్ పార్టులు పార్టులుగా సాగుతూ, అరెస్టులు, లేఖలు, సస్పెన్షన్లు అంటూ మొదలై ప్రస్తుతం ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ అయ్యింది. ఆ రాజకీయమే కవితను బిఆర్ఎస్ కి దూరం చేసింది, తిరిగి జాగృతిని తెలంగాణ రాజకీయాలలోకి తెచ్చింది,
హరీష్ ని గుంటన్నక్క చేసింది, హరీష్ ని గూఢచారిగా మార్చింది, కేటీఆర్ నాయకత్వాన్ని ఒప్పుకోలేను అనే స్థాయికి వెళ్ళింది, కేసీఆర్ సిట్ విచారణకు హాజరయితే రచ్చేందుకు అనే వరకు వచ్చింది.






