కల్వకుంట్ల కవిత ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీలో మహారాణిలా ఉండేవారు. కానీ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో ఒంటరిగా మారారు. అదే విచిత్రమనుకుంటే, ఆమె సొంత పార్టీతోనే యుద్ధం చేస్తుండటం లేదా చేయాల్సిరావడం మరో విచిత్రం. ఆమె అలా ఎందుకు చేస్తున్నారు? అంటే మూడు బలమైన కారణాలు కనిపిస్తున్నాయి.
1. తన తండ్రి, అన్న నడిపిస్తున్న పార్టీ నుంచి తనను అవమానకరంగా బహిష్కరించారు కనుక ఆ కోపంతో కావచ్చు.
2. కాంగ్రెస్, బీజేపిలను విమర్శించడం కంటే బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తూ దానితోనే యుద్ధాలు చేస్తుంటే ప్రజల నమ్మకం పొందవచ్చని కావచ్చు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డికి ఆమెకి మద్య మాటల యుద్ధం మీడియాలో బాగా హైలైట్ అయ్యింది కూడా! ఒంటరి పోరాటం చేస్తున్న ఆమెకు ఇప్పుడు ఇలాంటి ఫ్రీ పబ్లిసిటీ, ప్రజల సానుభూతి చాలా అవసరం. కనుక ఇకపై ఆమె బీఆర్ఎస్ నేతలపై విమర్శలు జోరు పెంచవచ్చు.
3. రేపు సొంత కుంపటి పెట్టుకుంటే కాంగ్రెస్, బీజేపిల నుంచి ఎవరూ రారు. కానీ బీఆర్ఎస్లో చాలా మంది టచ్లో ఉన్నారని ఆమె చెప్పుకుంటున్నారు. కనుక తాను మళ్ళీ కేసీఆర్ పంచన చేరబోనని, అలాగే తన నాయకత్వంపై వారికి నమ్మకం కలిగేందుకు ఆమె బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసుకున్నారని భావించవచ్చు.
ఈ ప్రయత్నాలలో ఆమె తన తండ్రి హయంలో జరిగిన అవినీతి, ప్రభుత్వంలో అవినీతిపరులు, వారు చేసిన అవినీతి పనులు, వారి అక్రమార్జనలు అన్నీ బయటపెడుతున్నారు.
అలాగే తండ్రి పాలనలో తెలంగాణ రాష్ట్రం అంత గొప్పగా ఏమీ అభివృద్ధి చెందలేదని, ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని ఆమె చెపుతున్నారు.
కేసీఆర్ ‘ప్రాజెక్ట్ కలలకు’ రాష్ట్రంలో వేలాదిమంది రైతులు రోడ్డున పడ్డారు. కేసీఆర్పై కాంగ్రెస్, బీజేపిలు చేస్తున్న అవినీతి ఆరోపణలు నిజమేనని స్వయంగా ద్రువీకరిస్తున్నట్లువుతోంది.
ఆమె చేస్తున్న అవినీతి ఆరోపణలతో పార్టీకి మూల స్థంభాల వని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల ఇమేజ్, దాంతో బాటే పార్టీ ప్రతిష్ట దెబ్బతింటాయి. ఇవన్నీ ఆమెకు తెలియవనుకోలేము.
కానీ అవినీతి ఆరోపణలు చేస్తున్నారంటే దానర్ధం బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగినా పరవాలేదని లేదా దానిని భూస్థాపితం చేసి తన రాజకీయ ఉన్నతికి దానిని పునాదిగా మార్చుకోవాలనే ఆలోచన ఉండి ఉండవచ్చు. కనుక కేటీఆర్ ముందుగా కాంగ్రెస్, బీజేపిలతో కాకుండా చెల్లి కవితతో అమీ తుమీ తేల్చుకోవడం చాలా మంచిది. లేకుంటే కాంగ్రెస్, బీజేపిల కంటే ఆమె వల్లనే పార్టీకి ఎక్కువ నష్టం జరుగుతుంది కనుక!






