వైనాట్ పులివెందుల? చంద్రబాబు నాయుడు

Chandrababu Naiduనేడు విశాఖపట్నంలో టిడిపి జోన్-1 సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఉత్తరాంద్ర జిల్లాలకు చెందిన టిడిపి ఎమ్మెల్యేలు, టిడిపి నేతలు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లు హాజరయ్యారు. ఈ సమావేశంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ నేతలని ఉద్దేశ్యించి ప్రసంగిస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు నాయుడు వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఒక్క ఎమ్మెల్సీ ఎన్నికల దెబ్బ తగిలేసరికి జగన్‌లో భయం మొదలైంది. ఇదివరకు ఎమ్మెల్యేలకు టికెట్స్ ఇవ్వనని బెదిరిస్తే, ఇప్పుడు ఒక్క ఎమ్మెల్యేని కూడా వదులుకోనని కలిసి పనిచేద్దామని ఎమ్మెల్యేలను బ్రతిమాలుకొంటున్నారు. జగన్‌ డిక్షనరీలో లేని ‘మానవ సంబంధాలు’ గురించి మాట్లాడుతున్నారిప్పుడు. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓడిపోగానే నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేసి, ఇప్పుడు ఆ ఓటమిని కప్పి పుచ్చుకోవడానికి కుంటిసాకులు చెప్పుకొంటున్నారు,” అని అన్నారు.

ADVERTISEMENT

“విశాఖ రాజధాని అంటూ నాలుగేళ్ళుగా పాట పాడుతున్న సిఎం జగన్‌, విశాఖపట్నంలో ఒక్క అభివృద్ధి పని గురించి చెప్పగలరా? చెప్పలేరు కానీ ఋషికొండకు గుండుకొట్టేసి, అంతా పెద్ద కొండను పరదాలు వేసి దాచేయాలని ప్రయత్నించారు. భోగాపురం విమానాశ్రయం కోసం మన ప్రభుత్వం, భూములు సేకరించి అన్నీ సిద్దం చేస్తే, ఈ నాలుగేళ్ళలో జగన్ ప్రభుత్వం అక్కడ ఒక్క ఇటుక కూడా వేయలేకపోయింది.

మన ప్రభుత్వం రాష్ట్రానికి ఐఐఎం వంటి ప్రతిష్ఠాత్మకమైన అనేక విద్యాసంస్థలను తీసుకువస్తే, జగన్ ప్రభుత్వం ఏపీకే గర్వకారణమైన గీతం యూనివర్సిటీని కూల్చేసేయాలని విశ్వప్రయత్నాలు చేసింది. మనం ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ కంపెనీని తీసుకువస్తే జగన్ ప్రభుత్వం దానిని తరిమేసింది. మనం విశాఖ నగరానికి ఐ‌టి కంపెనీలు తెస్తే, అవన్నీ జగన్ ప్రభుత్వాన్ని చూసి పొరుగు రాష్ట్రాలకు పారిపోతున్నాయి. జగన్‌ పాలనలో విధ్వంసమే తప్ప అభివృద్ధి ఉండదని స్పష్టం అయిపోయింది. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలలో పట్టభద్రులు టిడిపిని గెలిపించారు,” అని చంద్రబాబు నాయుడు అన్నారు.

అమరావతికి భూములు ఇచ్చిన రైతులను జగన్ ప్రభుత్వం అవమానించింది. ఇక్కడ ప్రజల కోసం భూములు ఇచ్చి మాన్సాస్ ట్రస్ట్ ద్వారా అనేక విద్యాసంస్థలను నడిపిస్తున్న అశోక్ గజపతిరాజుగారిని జగన్ ప్రభుత్వం దారుణంగా అవమానించింది. ప్రజలు జగన్‌ పాలనతో వేసారి పోయి ఉన్నారు. మార్పు కోరుకొంటున్నారు.

వైనాట్ 175? అని జగన్‌ పదేపదే అంటున్నారు కదా? కనుక ఈసారి 175 సీట్లలో వైసీపీని ఓడించి చూపుదాము. మనం కూడా వైనాట్ పులివెందుల?అని అక్కడే జగన్మోహన్ రెడ్డిని ఓడించి మన సత్తా చాటుకొందాము. వచ్చే ఎన్నికలలో జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించి రాష్ట్రాన్ని కాపాడుకొందాము,” అని చంద్రబాబు నాయుడు అన్నారు.

ADVERTISEMENT
Latest Stories