ఆలయాలలో లౌకికవాదం దేనికి? పవన్‌

secularism-pawan-kalyan

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ మంగళవారం సాయంత్రం అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమల చేరుకొని రాత్రి కొండపై గాయత్రీ నిలయంలో బస చేశారు. తిరుమల ప్రసాదం విషయంలో జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తంగా పవన్‌ కళ్యాణ్‌ 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టి ఈరోజు ఉదయం స్వామివారిని దర్శించుకొని దీక్ష విరమించనున్నారు. స్వామివారి దర్శనం చేసుకున్నా తర్వాత ఈరోజు సాయంత్రం వరకు తిరుమల కొండపైనే ఉంటారని సమాచారం.

పవన్‌ కళ్యాణ్‌తో పాటు ఆయన అభిమానులు, జనసేన, టిడిపి కార్యకర్తలు భారీ సంఖ్యలో అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమల చేరుకున్నారు. టీటీడీ బోర్డు సభ్యులు వారికి సాదరంగా స్వామివారి సన్నిధికి స్వాగతం పలికారు.

ADVERTISEMENT

ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ మీడియాతో మాట్లాడుతూ, “నేను కేవలం ప్రసాదంలో కల్తీ జరిగినందుకు మాత్రమేప్రాయశ్చిత్త దీక్ష చేయడం లేదు. గత 5 ఏళ్ళుగా తిరుమలతో సహా రాష్ట్రంలో దేవాలయాలలో చాలా అపచారాలు జరిగాయి. వాటన్నిటికీ ప్రాయశ్చిత్తంగానే ఈ దీక్ష చేపట్టాను. ఆలయాలలో పవిత్రతని కాపాడటానికి సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు కావాలని నేను కోరుకొంటున్నాను.

తిరుమల ప్రసాదానికి వినియోగించే నెయ్యి కల్తీ జరుగలేదని సుప్రీంకోర్టు అనలేదు. ఆ కల్తీ నెయ్యి సరఫరా అయిన తేదీల విషయంలోనే కాస్త గందరగోళం ఏర్పడిన్నట్లు అర్దమవుతోంది. ఈ అంశంపై సుప్రీంకోర్టు కోట్లాది మంది భక్తుల మనోభావాలను గౌరవిస్తూ తగిన నిర్ణయం తీసుకొంటుందని ఆశిస్తున్నాను.

ఈ వ్యవహారంపై సిఎం చంద్రబాబు నాయుడు తొందరపడి మాట్లాడలేదు. ఆయన నివేదికలన్నీ తెప్పించుకొని వాటి గురించి మా అందరితో సంప్రదించిన తర్వాతే మీడియాతో మాట్లాడారు. ఈ విషయంలో ఆయనకి, నాకు రాజకీయాలు చేయాల్సిన అవసరమే లేదు.

కేవలం తిరుమలలో జరుగుతున్న అపచారాలను బయటపెట్టాము. దీనిపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది కనుక ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణ తాత్కాలికంగా నిలిపివేశాము. సుప్రీంకోర్టు ఆదేశానుసారమే మా ప్రభుత్వం ముందుకు వెళుతుంది,” అని పవన్‌ కళ్యాణ్‌ అన్నారు.

అంతకు ముందు ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్‌ కళ్యాణ్‌ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “లౌకికవాదాన్ని పరిపాలనకు, రాష్ట్రాభివృద్ధికి, సంక్షేమ పధకాలకు, ఉద్యోగాలు, ఉపాధి వంటివాటికి మాత్రమే పరిమితం. భక్తుల మత విశ్వాసాలతో ముడిపడుతున్న దేవాలయాలలో లౌకికవాదం ఎలా కుదురుతుంది? అక్కడ లౌకికవాదానికి ప్రవేశమే ఉండకూడదు,” అని అన్నారు.

లౌకికవాదం అంటే అన్ని మతాలకు సమాన గౌరవం, ప్రాధ్యాన్యత ఇవ్వడం. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ చెప్పిన్నట్లు ఇది రాజకీయాలు, పాలనకి మాత్రమే పరిమితం కావలసి ఉండగా లౌకికవాదం అంటే హిందూమతాన్ని విమర్శించడం, హిందూ మతం గురించి మాట్లాడితే అది మతతత్వం, లౌకికవాదానికి విరుద్దం అనే వక్రభాష్యం చాలా బలంగా ఉంది.

కనుక పవన్‌ కళ్యాణ్‌ చెప్పిన్నట్లు లౌకికవాదాన్ని పాలనకు పరిమితం చేసి ఆలయాలలో హిందూ మత విశ్వాసాలకు మాత్రమే పూర్తి ప్రాధ్యాన్యత ఇస్తూ అందుకు తగిన విదంగానే ఆలయాల నిర్వహణ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ADVERTISEMENT
Latest Stories