సెప్టెంబరు 2, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్దంతి. ఆయన ప్రమాదంలో మరణించాక తెలుగు మీడియా చేసిన ప్రచారం, ఆయన అనుచరులు ఒక క్రమపద్దతిలో మహానేత అంటూ పేర్చిన సానుభూతి వల్ల, ఆయన అభిమానులు కూడా వైయస్ జయంతి కంటే వర్దంతినే ఎక్కువగా గుర్తుంచుకుంటూ వస్తున్నారు. అప్పటి నుండి దాదాపు ఆయన తనయుడు అధికారంలోకి వచ్చిన 2019 వరకు సెప్టెంబరు 2 న వైసిపి కానీ, ఆ పార్టీ నాయకుల కానీ పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరిపేవారు. వాటికి ఆయన కుటుంబ మీడియా, ఒక వర్గం మీడియాల్లో అంతే ఎత్తున ప్రచారం లభించేది.
ఆయన వర్దంతి వైసిపి అభిమానులకు సొంత కుటుంబ కార్యక్రమంలా జరిపేవారు. అలాగే మరొక ప్రముఖ నాయకుడు దివంగత పరిటాల రవీంద్ర అభిమానుల స్ఫూర్తితో ఒకటి రెండు సంవత్సరాలు వైయస్ మాల అంటూ కూడా హడావుడి జరిగింది. ఇది ఎంతలా అంటే వైయస్ మరణం వరకు సుఖ సంతోషాలు, భోగ భాగ్యాలతో వర్ధిల్లిన ఆంధ్రప్రదేశ్ సెప్టెంబరు 2 తరువాత అంధకారంలోకి వెళ్లి పోయిందని ఒక వర్గం యువత బలంగా నమ్మి ఇతరులతో వాదనలు జరిపేంతగా. ఇక ఆరోజు వైసిపి అభిమానులు తమ సోషల్ మీడియాల్లో సంతాపాలు, సందేశాల పేరిట హోరెత్తింతేవారు. అలా దాదాపు వైసిపి అధికారంలోకి వచ్చిన 2019 వరకు ఆ హోరు తగ్గలేదు. అధికారం చేతికందాక ప్రతి సంవత్సరం లక్షల రూపాయల ప్రభుత్వ ఖర్చుతో కుటుంబ కార్యక్రమాన్ని చాలా ఘనంగా చేసుకుంటూ వస్తున్నారు. కానీ 2020 నుంచి క్రమంగా వైయస్ వర్ధంతి కార్యక్రమాలు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. మెుదటి రెండేళ్ళ కోవిడ్ వల్ల బయటకు రావడం లేదంటూ అభిమానులు సమర్దించినా గత సంవత్సరం, ఈ సంవత్సరం జరిగినంత పేలవంగా గతంలో ఎప్పుడూ జరగలేదు.
వాస్తవానికి ఇప్పుడు వైసిపి అధికారంలో ఉంది, పంచాయితీల నుండి పార్లమెంట్ వరకు 80% పైగా వైసిపి నాయకులే. గతంలో ఏ ముఖ్యమంత్రి చెలాయించనంత అధికారం ప్రస్తుతం చెలాయిస్తున్నారని ఆరోపణలు. లోకల్ నాయకుడి నుండి, పై స్ధాయి వరకు లాండ్, సాండ్, వైన్-మైన్ అంటూ కోట్లకు పడగలెత్తారని విమర్శలు. అయినా, నెలకొక బటన్ నొక్కుతున్నాం ప్రజలు సఖ సంతోషాలతో ఉన్నారని గోడ పత్రిక నుండి సోషల్ మీడియా గోడల వరకు స్పాన్సర్డ్ ప్రచారం కళ్ళు, చెవులు హోరెత్తుతుంది. మరి అటువంటి పరిస్దితిలో మహానేత అని చెప్పే వైయస్ వర్దంతి ఆయన కుమారుడి అద్భుత పాలనలో చాలా ఘనంగా జరగాలి.
అటువంటిది కేవలం కుటుంబ పత్రికలో కొన్ని పార్టీ నాయకుల ప్రకటనలు, ప్రభుత్వం అధినేతగా ప్రభుత్వం ఖర్చుతో ఇడుపులపాయలో చేసిన కార్యక్రమం తప్ప బయట ఆ పార్టీ నాయకులు హడావుడి చాలా తక్కువగా ఉంది. సోషల్ మీడియాల్లో కూడా ఒక వర్గం యువత పెట్టుకున్న డిపిలు తప్ప ఇతర కార్యకర్తలు కూడా పెద్దగా స్పందించలేదు. వాస్తవానికి ఎలక్షన్ల సంవత్సరంలో టికెట్లు ఆశించేవారు పోటీలు పడి ఇటువంటి కార్యక్రమాలు చేస్తారు, తమ అనుచరగణంతో చేపిస్తారు. అందులోనూ 175 మేమే గెలుస్తాం అని ప్రకటించే పార్టీలో ఎంత పోటీ ఉండాలి.
కాని ఆశ్చర్యకరంగా ఎక్కడా ఆశించిన స్పందన కానీ, గతంలో ఉత్సాహం గానీ లేవు. ఇది ప్రజల్లో వచ్చిన మార్పుని సూచిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ప్రతిపక్షాల కార్యక్రమాలకు స్వచ్ఛందంగా పోటెత్తుతున్న జనం, అధికార పార్టీ నాయకులు కనబడితే నిలదీస్తున్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి సభలకే ప్రజలు గోడలు దూకి పారిపోతున్నారు. వీటికి కొనసాగింపే వైయస్ వర్ధంతినా వచ్చిన పేలవ స్పందన అని చర్చిస్తున్నారు. ఇప్పటికే ఆలస్యం అయినా కనీసం ఈ ఏడెనిమిది నెలల్లో అయినా ప్రభుత్వ పెద్దలు కులంమే చూస్తాం, మతమే చూస్తాం అన్నట్టుగా కాక ప్రజలకు ఉపయెూగపడే పనులు కొన్నైనా చేస్తే పరిస్ధితి కొంత మెరుగుపడే అవకాశం ఉందేమెూ.



