“2019 ఎన్నికలలో అంత భారీ మెజార్టీతో గెలిచిన వైసీపీ 2024లో ఎన్నికలలో అంత దారుణంగా ఎందుకు ఓడిపోయింది?” అంటే ఈవీఎంలని ఒకే ఒక ముక్కలో జగన్ తేల్చి పడేశారు.
కానీ 2029లో కూడా అవే ఈవీఎంలతోనే ఎన్నికలు జరుగుతాయి కదా?మరి అప్పుడు తప్పకుండా గెలుస్తామని జగన్ ఎలా చెప్తున్నారు? 175/175 అనుకుంటే 175/11 అయ్యింది. మళ్ళీ ఆ నంబర్లు మారాలంటే ఊరికే మారిపోవు. ఏమైనా సాఫ్ట్ వేర్ రెడీ చేసుకుంటున్నారా?అంటే కోపం వస్తుంది.
దాదాపు రెండేళ్ళుగా వైసీపీ నేతలు ఒక్కొక్కరూ తమ ఓటమికి ఒక్కో కారణం చెపుతూనే ఉన్నారు. ఆ జాబితా చూస్తుంటే కర్ణుడి చావుకి శాపాలు గుర్తు వస్తాయి.
తాజాగా వైసీపీ ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి మరో కారణం చెప్పారు. వాలంటీర్ల కారణంగానే తాము ఓడిపోయామన్నారు. జగన్ ముఖ్యమంత్రి కాగానే తమ వంటి నేతలను, కార్యకర్తలని కాదని వాలంటీర్లకి ప్రాధాన్యం ఇవ్వడంతో తమకు ప్రజలతో కనెక్షన్ కట్ అయిపోయిందన్నారు. కనుక జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే ఈసారి వాలంటీర్లను పూర్తిగా పక్కన పెట్టేయాలని బాలనాగిరెడ్డి అన్నారు. ఒకవేళ మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తే ఈసారి వాలంటీర్లు ఉండరని ధైర్యంగా చెప్పగలరా?అంటే అనుమానమే.
అయితే నాడు జగన్ సిఎంగా తిరుగులేని అధికారం చలాయిస్తున్నప్పుడు, పార్టీలో ఎవరికీ ఆయనకు ఈ ముక్క చెప్పేందుకు ధైర్యం చాలలేదు. ఇప్పుడు ధైర్యం చేసి ఇలా చెప్తున్నా ప్రయోజనం లేదు.
ఎందువల్లనంటే, సిఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. అమరావతి, పోలవరం నిర్మాణాలు పూర్తవుతాయి, కూటమిలో పార్టీల మద్య బంధం మరింత బలపడుతుంది కనుక అని చెప్పుకోవచ్చు.
లేదా వచ్చే ఎన్నికలలో కూడా వైసీపీ ఓటమికి కారణమైన అవే ఈవీఎంలే ఉంటాయి కనుక అని కూడా చెప్పుకోవచ్చు. కనుక వైసీపీ నేతలందరూ చేతులు కాలక ఆకులు పట్టుకొని ఇలా వాపోయే బదులు, ఇప్పటికైనా తాడేపల్లి ప్యాలస్కి వెళ్ళి ధైర్యంగా “అయ్యా జగన్గారు మీరు చేసిన తప్పులు ఇవీ. వెంటనే వీటిని సరిదిద్దుకోండి. లేకుంటే మళ్ళీ మనకి ఓటమి తప్పదు,” అని చెప్పే ధైర్యం వైసీపీలో ఎవరికైనా ఉందా? ఉంటే వెళ్ళి చెప్పేస్తే మంచిది.






