ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి తమ కుటుంబ వ్యాపారాలను చూసుకుంటూనే, అనేక సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటుంటారు. కానీ భర్త, కుమారుడు ఇద్దరూ రాజకీయాలలో ఉన్నప్పటికీ ఆమె వాటికి కాస్త దూరంగానే ఉంటారు.
జగన్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు తొలిసారిగా ఆమె, కోడలు బ్రాహ్మిణి ఇద్దరూ ప్రజల మద్యకు వచ్చి న్యాయం కోసం పోరాడారు.
భర్త కోసం నారా భువనేశ్వరి చేసిన పోరాటాలు, ఆమె వాదనలు రాష్ట్రంలో మహిళలను చాలా ఆలోచింపజేశాయి. ఎన్నికలలో వైసీపీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత “ఇన్ని సంక్షేమ పధకాలు ఇచ్చినా అక్క చెల్లెమ్మలు నన్ను ఎందుకు వద్దనుకున్నారో అర్దం కావడం లేదని” జగన్ అన్నారు. ఆయన మాటలే రాష్ట్రంలో మహిళలని నారా భువనేశ్వరి చాలా ప్రభావితం చేశారని స్పష్టం చేస్తున్నాయి.
ఆ ఎన్నికలలో చంద్రబాబు నాయుడుని కుప్పంలోనే ఓడించి టీడీపీని చావు దెబ్బ తీయాలని “వైనాట్ కుప్పం?” అంటూ జగన్ విశ్వప్రయత్నాలు చేశారు.
ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో పెద్దగా ప్రచారం చేయకపోయినా భర్త తరపున నారా భువనేశ్వరి కుప్పంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేస్తూ జగన్ ప్రయత్నాలకు చెక్ పెట్టారు. భారీ మెజార్టీతో భర్తని గెలిపించుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాలలో ప్రవేశించకపోయినా తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు.
ఆ ఎన్నికల సమయంలోనే ఆమె “ఈసారి కుప్పం నుంచి నేను పోటీ చేస్తే గెలిపిస్తారా?” అని సరదాగా ప్రజలను అడిగారు.
అప్పుడు సరదాగానే ఆ మాట అన్నప్పటికీ, ఇటీవల ఆమె తరచూ కుప్పంలో పర్యటిస్తుండటం, వివిద కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటుండటం గమనిస్తే ఆమె రాజకీయాలలో ప్రవేశించి వచ్చే ఎన్నికలో పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తున్నారు.
ఒకవేళ ఆమె నిజంగానే ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశిస్తే, టీడీపీ అభిమానులకు పండగే.. ఆమె ప్రత్యక్ష రాజకీయాలలో ప్రవేశిస్తే టీడీపీలో బలమైన మహిళా నాయకురాలు లేని లోటు కూడా తీరిపోతుంది. కానీ ఆమెకు ఈ ఉద్దేశ్యం ఉన్నట్లయితే ఇప్పుడే ఈ విషయంపై స్పష్టత ఇస్తే అది కూడా పార్టీకి సానుకూలంగా మారుతుంది కదా?




