వైసీపితో జగన్ రాజకీయాలు ప్రారంభించినప్పటి నుంచి రాష్ట్రంలో రాజకీయాల తీరు తెన్నులను సమూలంగా మార్చేశారు.
ఒకప్పుడు పరస్పర విమర్శలతోనే రాజకీయాలు సాగేవి. కానీ జగన్ వచ్చిన తర్వాత సొంత మీడియాతో దుష్ప్రచారం చేయిస్తుండటం, అబద్దాలు ప్రచారం చేయిస్తుండటం, జరిగినవి జరగనట్లు, జరగనివి జరిగిన్నట్లు ప్రచారం చేయిస్తుండటం కూడా రాజకీయాలనుకునే పరిస్థితి దాపురించింది. ఇలా ఒకటేమిటి ఎంత చెప్పుకున్నా తరిగేది కాదు.
విజయవాడలో సిఎం చంద్రబాబు నాయుడు శరవేగంగా సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తుంటే, నగర ప్రజలే కాదు… ఇరుగుపొరుగు రాష్ట్రాల ప్రజలు కూడా మెచ్చుకొంటున్నారు. అయితే నాకు ఓ కన్నుపోయినా పర్వాలేదు ఎదుటవాడికి రెండు కళ్ళూ పోవాలనుకునే రకం వైసీపిది.
పాస్పోర్ట్ రాకపోవడంతో లండన్ వెళ్ళలేకపోయిన జగన్, గాలికి పోయే పేలాలు కృష్ణార్పణం అన్నట్లు, ప్రజల కష్టాలు చూసి వారి కోసమే తన ప్రయాణం వాయిదా వేసుకున్నానన్నట్లు రోడ్లపైకి వచ్చి హడావుడి చేస్తున్నారు.
విజయవాడలో వరద బాధితులకు బియ్యం సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని వందల బియ్యం లారీలను, బియ్యం పంపిణీ వాహనాలను రప్పించింది. నగరంలో బారులు తీరిన వాటి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దేశవిదేశాలలోవారు విజయవాడలో జరుగుతున్న ఈ సహాయ కార్యక్రమాలు చూస్తున్నారు. దీంతో జగన్, వైసీపిలకీ ఏమి చేయాలో పాలుపోలేదు.
దీంతో “చివరికి జగనే దిక్కయ్యాడు” అంటూ ఓ వైసీపి వీరాభిమాని ఆ బియ్యం పంపిణీ వాహనాల ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టారు. అంటే జగన్ ఏర్పాటు చేసిన ఆ వాహనాలు లేకపోతే సిఎం చంద్రబాబు నాయుడు బియ్యం పంపిణీ చేయలేరన్నట్లుంది. ఇదెలా ఉందంటే నా కోడి కూయకపోతే లోకానికి తెల్లారాదన్నట్లే ఉంది.
ఆ లెక్కన జగన్ తాను వద్దనుకున్న అమరావతిలోనే చంద్రబాబు నాయుడు కట్టించిన శాసనసభ, సచివాలయంలోనే 5 ఏళ్ళు కూర్చొని పాలించారు కదా?అని టిడిపి కూడా అడగొచ్చు కదా?
అయితే జగన్ ఏర్పాటు చేసిన వాహనాలను సిఎం చంద్రబాబు నాయుడు వాడుకుంటున్నారని చాటింపు వేసుకునే ప్రయత్నంలో టిడిపి కూటమి ప్రభుత్వానికి ఉచిత ప్రచారం చేస్తున్నామనే విషయం మరిచిపోయారు.
టిడిపిలో ఎవరూ ఈ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు. ఇంత చక్కగా ఫోటోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయలేదు. కానీ టిడిపిని ఎద్దేవా చేయాలనే ప్రయత్నంలో వైసీపి చేసింది. బారులు తీరిన ఆ వాహనాలను చూస్తే, టిడిపి కూటమి ప్రభుత్వం ఏ స్థాయిలో సహాయ చర్యలు చేపడుతోందో ఎవరికైనా అర్దమవుతుంది.




