శాసనసభ ఎన్నికలలో వైసీపి దారుణంగా ఓడిపోయి, టిడిపి కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి రావడంతో ఇక వైసీపి కోలుకోవడం ఇక కష్టమే అని, జగన్ దేశం విడిచి పారిపోతారని ఊహాగానాలు వినిపించాయి.
అయితే సిఎం చంద్రబాబు నాయుడు సోలార్ ప్యానల్స్ నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే రకమైతే, జగన్ శూన్యం నుంచి కూడా విద్యుత్ ఉత్పత్తి చేయగల ఘనుడు.
తనకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వాలంటూ మడత పేచీ ఇందుకు చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
తన హయాంలో విచ్చలవిడిగా టిడిపి కార్యాలయాలపై దాడులు జరిపించిన జగన్, ప్రతిపక్షంలోకి మారగానే వైసీపి నేతలపై ఈగ వాలినా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఢిల్లీ వరకు వినిపించేలా గగ్గోలు పెడుతూ అందరి దృష్టిని ఆకర్షించారు.
అచ్యుతాపురం ఘటనలో, విజయవాడ వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం అయ్యిందని మరోసారి రచ్చరచ్చ చేశారు.
ఆ తర్వాత తిరుమల వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయినప్పటికీ సొంత మీడియాతో జనాలను ఊదరగొడుతూ, చంద్రబాబు నాయుడే అపచారం చేశారని చాలా ధైర్యంగా వాదించారు. జగన్ చేస్తున్న ఈ ప్రయత్నాలు, వ్యూహాలు ఫలించకపోయి ఉండొచ్చు. కానీ వైసీపి నేతలు, కార్యకర్తలను యాక్టివ్ చేసేందుకు అవే ఎంతో కొంత తోడ్పడ్డాయి..
తిరుమల పర్యటన ప్రకటన, చివరి క్షణంలో పర్యటన రద్దు చేసుకోవడం, డిక్లరేషన్ చేయడానికి నిరాకరిస్తూనే తిరిగి అందుకు సిఎం చంద్రబాబు నాయుడునే తప్పు పట్టడం వంటివన్నీ జగన్ అతి తెలివి తేటలకు చక్కటి నిదర్శనాలుగా చెప్పుకోవచ్చు.
ఎన్నికలలో ఓడిపోయినా మనమే గెలిచామని, మళ్ళీ మనమే అధికారంలో వస్తామని జగన్ చెపుతున్న మాటలని వైసీపి నేతలు ఎవరూ నమ్మడం లేదు. కానీ వారికి వేరే గత్యంతరం లేదు. కనుక జగన్కు ‘తాన తందాన’ పాడక తప్పడం లేదు. జగన్కు అది చాలు. అంటే జగన్ తన పార్టీ నేతలని కూటమి ప్రభుత్వంతో పోరాటాలకి మెల్లగా సిద్దం చేసుకుంటున్నారన్న మాట!
కనుక వైసీపిని, జగన్ని చావు దెబ్బ తీశామని టిడిపి కూటమి మురిసిపోవడానికి ఏమీ లేదు. కానీ జగన్ మళ్ళీ యుద్ధానికి సిద్దం అవుతున్నారని గుర్తించి అప్రమత్తమైతే చాలు. లేకుంటే చాప కింద నీరులా విస్తరించి 2019 ఎన్నికలలో మాదిరిగానే మళ్ళీ దెబ్బ తీయడం ఖాయమే.






