ప్రజలు ఈసారి ఏపీని ఎవరి చేతుల్లో పెడతారో?

YS Jagan - Chandrababu Naidu Polavaram Project-దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఓ రాజకీయ ప్రయోగశాలగా మారిపోయింది. హైదరాబాద్‌ను హైటెక్ చేసి తెలంగాణ రాష్ట్రానికి అక్షయపాత్రను అందించిన చంద్రబాబు నాయుడు సమర్ధతపై నమ్మకంతో ప్రజలు మొదట సరైన నిర్ణయమే తీసుకొని ఆయనకు అధికారం అప్పగించారు. ఆయన కూడా వారి నమ్మకాన్ని నిలబెట్టుకొంటూ రాజధాని అమరావతికి శ్రీకారం చుట్టి శరవేగంగా నిర్మాణ పనులు చేయించారు.

చంద్రబాబు నాయుడు ఊహించినట్లుగా అమరావతి అభివృద్ధి చెందితే పెట్టుబడులు, పరిశ్రమలు రాష్ట్రానికి తరలివస్తాయి. దాంతో పొరుగు రాష్ట్రం నష్టపోతుంది. కనుక ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ‘ఒక్క ఛాన్స్’ అంటూ తిరుగుతున్న జగన్మోహన్ రెడ్డికి సహకరించారు.

ADVERTISEMENT

అదే సమయంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కూడా గట్టిగా నిలదీయడంతో, అది కూడా తెర వెనుక చక్రం తిప్పింది. ప్రజలు కూడా జగనన్నకు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దాం అనుకొన్నారే తప్ప తమ నిర్ణయంతో రాష్ట్రాభివృద్ధికి బ్రేకులు పడతాయని గ్రహించలేకపోయారు.

ఈ విషయంలో తెలంగాణ ప్రజలు చాలా తెలివిగా వ్యవహరించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపుతున్న కేసీఆర్‌కే మళ్ళీ ఓట్లేసి గెలిపించారు. వారి నిర్ణయం సరైనదేనని కేసీఆర్‌ రుజువు చేస్తున్నారు. అదేవిదంగా ఏపీ ప్రజల నిర్ణయం తప్పని సిఎం జగన్మోహన్ రెడ్డి రుజువు చేసి చూపిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో నిత్యం వినిపించే ఒకే ఒక్క మాట అభివృద్ధి. ఏపీలో ఆ మాట వినిపించి మూడేళ్ళయింది. తెలంగాణలో అభివృద్ధి అంటే పారిశ్రామిక అభివృద్ధి, వాణిజ్యాభివృద్ధి, వ్యవసాయాభివృద్ధి, మౌలికవసతుల అభివృద్ధి, విద్యా, వైద్య, విద్యుత్‌ రంగాలలో అభివృద్ధి వాటితో ఆర్ధికాభివృద్ధి..మొత్తంగా రాష్ట్ర సమగ్రాభివృద్ధిగా కనిపిస్తోంది.

కానీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం జగనన్న చేతికి వచ్చినప్పటి నుంచి అభివృద్ధికి అర్దం, నిర్వచనం రెండూ మారిపోయాయి. అభివృద్ధి అంటే ‘సంక్షేమం’ అని భావిస్తుంటుంది. కనుక అటువంటి అభివృద్ధి కోసం ఎన్ని లక్షల కోట్లయినా అప్పులు చేసి పంచిపెట్టవచ్చని వైసీపీ ప్రభుత్వం గట్టిగా నమ్ముతోంది.

తెలంగాణ ప్రభుత్వం అప్పులు తెచ్చి దానిని రాష్ట్రాభివృద్ధికి వినియోగిస్తూ సంపద సృష్టిస్తుంటే, ఇక్కడ ఏపీ ప్రభుత్వం అభివృద్ధిగా భావిస్తున్న సంక్షేమ పధకాల కోసం అప్పులు చేసి మరీ పంచిపెడుతోంది. ప్రజలకు లక్షల కోట్లు పంచిపెడుతుంటే దానినీ ప్రతిపక్షాలు తప్పు పడుతున్నాయని సిఎం జగన్మోహన్ రెడ్డి స్వయంగా చెప్పడం చూస్తే తను చేస్తున్నది సరైనదేనని ఆయన ఎంత గట్టిగా నమ్ముతున్నారో అర్ధం అవుతుంది.

ప్రజలకు లక్షల కోట్లు పంచిపెడుతున్నాము కనుక వచ్చే ఎన్నికలలో మళ్ళీ తమకే ఓట్లు వేస్తారని లేదా వేయాలని వైసీపీ గట్టిగా నమ్ముతోంది. ఒకవేళ ప్రజలు కూడా ఇదే బాగుందనుకొంటే వైసీపీకే మళ్ళీ పట్టం కడతారు. లేకుంటే అభివృద్ధిని రుచి చూపించిన టిడిపిని ఎన్నుకొంటారు.

ఓ రాజకీయ ప్రయోగశాలగా మారి రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిన ఏపీని ఎవరి చేతుల్లో పెడతారో ప్రజల ఇష్టం. కానీ అదే వారి భవిష్యత్‌ను వారి పిల్లల భవిష్యత్‌ను నిర్దేశించబోతోందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు.

ADVERTISEMENT
Latest Stories