ఏపీ క్యాబినెట్ విస్తరణలో భాగంగా తమ పార్టీ నుండి వెళ్ళిన నేతలకు మంత్రి పదవులు ఇవ్వడంపై మండిపడిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, ఢిల్లీ వెళ్లి కేంద్ర స్థాయి నేతలతో మంతనాలు, ఫిర్యాదులు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తెరముందు రాజకీయం, తెరవెనుక మర్మం వేరే ఉందంటున్నారు టిడిపి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. జగన్ ఢిల్లీ పయనం వెనుక కారణాలు ఏపీ క్యాబినెట్ విస్తరణ కాదని, తన కేసుల నుండి ఎలా తప్పించుకోవాలా? అని ఢిల్లీ స్థాయి నేతలను అడుక్కుంటున్నారని అన్నారు.
అసలు ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చారంటూ రాష్ట్రపతి వద్దకు వెళ్తే ఏం ప్రయోజనం ఉంటుందని, రాష్ట్రపతి అసలేం చేస్తారని ప్రశ్నించిన జేసీ, దీని గురించి ఇక్కడున్న ముఖ్యమంత్రి వద్దకు కానీ లేదా ఢిల్లీలో ఉన్న ప్రధానమంత్రి వద్దకు కానీ వెళ్లాలని సూచించారు. మనం దేవుడి దగ్గరకు ఎందుకెళ్తాం… ‘ఆపద్బాంధవా కాపాడు తండ్రీ…’ అని మొక్కోవడానికే కదా… జగన్ కూడా అంతేనని… తనపై ఉన్న ఈడీ కేసుల నుంచి కాపాడాలని కోరుకోవడానికే ఢిల్లీకి వెళ్లాడని ఎద్దేవా చేశారు.
జగన్ కు ఏమీ తెలియదని అనుకుంటున్నారా… వాడికి అన్నీ తెలుసని, కేసుల నుంచి తప్పించండని అడుక్కోవడానికే ‘మావాడు’ (కులం రీత్యా) ఢిల్లీకి వెళ్లాడని అన్నారు. ఉన్నదేదో నిర్మొహమాటంగా మాట్లాడడమే తప్ప, ముందు వెనుక పెద్దగా ఆలోచించని జేసీ వ్యాఖ్యలు ఒక్కోసారి అధికార పార్టీ వర్గాలనే ఇరుకున పెడుతుంటాయి. ఎందుకంటే ఏపీ సర్కార్ ‘ప్రత్యేక హోదా’ గురించి పోరాటం చేస్తున్న సమయంలోనే అది రాదంటూ కుండబద్దలు కొట్టారు జేసీ. దీంతో జేసీ వ్యాఖ్యల్లో వాస్తవం ఏంటన్నది అందరికీ తెలిసి వచ్చింది. అంటే ప్రస్తుతం జగన్ విషయంలో కూడా అంతేనా..!?



