తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం అంశంపై యావత్ దేశం స్పందిస్తుండటంతో వైసీపి ఆత్మరక్షణలో పడింది. జగన్ చుట్టూ అనేకమంది హేమాహేమీలున్నా, కొత్తగా అధికార ప్రతినిధులను నియమించుకున్నా ఏ ఒక్కరూ ఈ అంశంపై మాట్లాడే సాహసం చేయలేకపోతున్నారు.
సున్నితమైన ఈ అంశంపై మాట్లాడితే తాము కూడా ప్రజాగ్రహానికి గురి కావలసి ఉంటుందనే ఇంగితమే వైసీపి నేతలను మౌనంగా ఉండేలా చేస్తోందని చెప్పవచ్చు.
ఆత్మరక్షణలో పడిన వైసీపిని కాపాడుకునేందుకు జగన్ ప్రెస్మీట్ చివరి అవకాశాన్ని కూడా జగన్ సరిగ్గా వాడుకోలేకపోయారు. జగన్ బలమైన సాక్ష్యాధారాలు చూపించి సిఎం చంద్రబాబు నాయుడు చేసిన ఆ ఆరోపణలు తప్పని నిరూపిస్తారనుకుంటే, ఏదేదో మాట్లాడి నవ్వులపాలయ్యారు. చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు.
సున్నితమైన ఈ అంశంపై దేశ ప్రజలు, జాతీయ స్థాయిలో ప్రముఖులు స్పందిస్తున్న తీరు చూస్తే జగన్, వైసీపి వాదనలు గాలిలో కాగితంలా కొట్టుకుపోతున్నాయి. కనుక తిరుమల లడ్డూ వైసీపి మీద అణుబాంబులా పడి ధ్వంసం చేసేస్తోందని చెప్పవచ్చు.
కనుక ఇప్పుడు ఈ సమస్య నుంచి వైసీపి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బయటపడాల్సి ఉంటుంది. లేకుంటే పార్టీలో నేతలు ప్రజలకు మొహం చూపించలేక, వారి ఆగ్రహాన్ని భరించలేక పార్టీని వీడటం మొదలుపెడితే వైసీపి సర్వనాశనం అయిపోతుంది. జగన్ సోదరి వైఎస్ షర్మిల ఇదే చెప్పారనుకోవచ్చు.
కనుక డైవర్షన్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం జగన్, వైసీపికే ఎక్కువ ఉందని చెప్పవచ్చు. అయితే ఇప్పటికిప్పుడు మీడియా, ప్రజల దృష్టిని ఈ అంశంపై నుంచి మళ్ళించాలంటే ఇంతకంటే బలమైన మరో అంశం ఉండాలి. జగన్ ఎటువంటి ఎత్తు వేస్తారో ఊహించడం కష్టమే కానీ తప్పక వేస్తారని మాత్రం భావించవచ్చు.
అలాగని సొంత పార్టీలో ఎవరిని బలి పశువు చేసుకున్నా వైసీపికి ఇంకా నష్టం జరుగుతుంది. కనుక ఈ సమస్య నుంచి బయటపడేందుకు టిడిపి కూటమి ప్రభుత్వానికి సంబందించి ఏదో కొత్త విషయం కనిపెట్టి దుష్ప్రచారం ప్రారంభించే అవకాశం ఉంది.
బహుశః తాడేపల్లి ప్యాలస్లో అందరూ కూర్చొని పధక రచనా చేస్తుండవచ్చు. దానిలో జగన్ పార్టీ నేతలకు ఒక లైన్ ఇస్తే వెంటనే టిడిపి కూటమి ప్రభుత్వంపై వైసీపి ఎదురుదాడి మొదలుపెట్టే అవకాశం ఉంటుంది. బహుశః నేడో రేపో అది మొదలవుతుంది కనుక టిడిపి కూటమి ప్రభుత్వం కూడా మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.






